Begin typing your search above and press return to search.

'ఎవ‌డు' మూవీ స్ఫూర్తితో భ‌ర్త‌నే చంపేసిది

By:  Tupaki Desk   |   10 Dec 2017 5:31 AM GMT
ఎవ‌డు మూవీ స్ఫూర్తితో భ‌ర్త‌నే చంపేసిది
X
త‌ప్పు అస‌లే చేయ‌కూడ‌దు. ఎంత తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శించినా నిప్పులాంటి నిజాన్ని దాచ‌లేరు. చావుతెలివితేట‌ల‌తో బ‌రితెగించిన ఒక మ‌హిళ వేసిన ఎవ‌డు సినిమా స్కెచ్‌ గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. వివాహేత‌ర సంబందం ఉచ్చులోకి కూరుకుపోయి.. ప్రియుడితో వేసిన ప్లాన్ ఎంత దారుణ ప‌రిణామాల‌కు దారి తీసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. త‌ప్పున‌కు శిక్ష ఖాయ‌మ‌న్న నిజంతో పాటు.. రీల్‌కు రియ‌ల్‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత‌న్న‌ది తాజా ఉదంతం చూస్తే అర్థ‌మ‌వుతుంది.

"ఎవ‌డు" సినిమాతో స్ఫూర్తి పొంది స్కెచ్ వేసిన ఒక‌ మ‌హిళ క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది. అల్లు అర్జున్‌.. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఈ మూవీలో.. పూర్తిగా కాలిపోయిన అల్లుఅర్జున్ శ‌రీరానికి రామ్ చ‌ర‌ణ్ మొహాన్ని ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ద్వారా అతికిస్తారు. స‌రిగ్గా ఈ పాయింట్ ఆధారంగా ఒక‌ మ‌హిళ త‌న భ‌ర్త‌ను చంపేసే ప్లాన్ వేసింది. అయితే.. సినిమాల్లో మాదిరి ప్రాక్టిక‌ల్ గా వ‌ర్క్ వుట్ కాద‌న్న లాజిక్ ను మిస్ అయి.. క‌ట‌క‌టాల‌పాలైంది. వివాహేత‌ర సంబంధం మీదున్న మోజుతో హ‌త్య‌కు సైతం వెనుకాడ‌ని ఆ మ‌హిళ ఉదంతంలోకి వెళితే..

నాగ‌ర్ క‌ర్నూల్‌ కు చెందిన స్వాతి.. సుధాక‌ర్ రెడ్డిలు భార్య‌భ‌ర్త‌లు. రెండేళ్ల క్రితం న‌డుంనొప్పితో బాధ ప‌డుతున్న స్వాతిని రాజేశ్ అనే ఫిజియోథెర‌పిస్ట్ ద‌గ్గ‌ర‌కు రోజూ తీసుకెళ్లేవారు. స్వాతికి వ్యాయామాలు చేయించే క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి అది కాస్తా వివాహేత‌ర సంబంధం వ‌ర‌కూ దారి తీసింది. గుట్టుగా సాగిపోతున్న వారి అక్ర‌మ‌ సంబంధం న‌వంబ‌రు 26న బైట‌ప‌డింది. భ‌ర్త‌కు తెలీకుండా ప్రియుడు రాజేశ్‌ తో క‌లిసి బైక్ మీద మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ కు వెళ్లింది స్వాతి.

అక్క‌డ వీరిద్ద‌రిని చూసిన సుధాక‌ర్ రెడ్డి స‌న్నిహితులు అత‌నికి ఫోన్ చేసి.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌ కు వ‌చ్చావా? అని అడిగారు. అత‌న్ని.. అత‌ని బైక్‌ ను చూశామ‌ని.. స్వాతిని కూడా చూసిన‌ట్లుగా చెప్పారు. దీంతో అనుమానం వ‌చ్చిన సుధాక‌ర్ రెడ్డి స్వాతిని నిల‌దీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

త‌మ విష‌యం బ‌య‌ట‌కు రావ‌టంతో భ‌ర్త‌ను చంపాల‌న్న ప్లాన్ వేశారు స్వాతి.. రాజేశ్ లు. భ‌ర్త సుధాక‌ర్‌.. ప్రియుడు రాజేశ్ దాదాపుగా ఒకేలా ఉండ‌టంతో ఎవ‌డు సినిమా స్ఫూర్తితో ప్లాన్ వేసింది. భ‌ర్త‌ను చంపేసి.. అత‌ని స్థానంలో ప్రియుడ్ని తీసుకురావాల‌ని భావించింది. త‌మ ప్లాన్ కు త‌గ్గ‌ట్లే భ‌ర్త‌ను చంపి.. ప్రియుడు రాజేశ్ ముఖం మీద యాసిడ్ పోసింది.

ఎవ‌రో త‌న భ‌ర్త ముఖం మీద యాసిడ్ పోసిన‌ట్లుగా డ్రామా ఆడింది. ఇంట్లో అత్త‌మామ‌ల్ని న‌మ్మించింది. ముఖం మీద గాయాలు ఉండ‌టంతో వారు సైతం ముఖం కాలింది త‌మ కొడుకేన‌ని న‌మ్మారు. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. యాసిడ్ గాయాల‌తో ఉన్న రాజేశ్ కు చికిత్స జ‌రుగుతున్న‌వేళ‌.. ఆసుప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న‌ది త‌మ కొడుకు కాద‌న్న సందేహం వ‌చ్చింది. క్రాస్ చెక్ చేసుకున్న వారు త‌మ‌కొచ్చిన సందేహం నిజ‌మ‌న్న‌ది అర్థ‌మై.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కేసు సున్నితంగా ఉండ‌టంతో ర‌హ‌స్యంగా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. ఆసుప‌త్రి బిల్లు క‌ట్టే స‌మ‌యంలో సిబ్బంది ద్వారా వేలిముద్ర‌లు తీసుకున్నారు. సుధాక‌ర్ రెడ్డి ఆధార్ లో ఉన్న వేలిముద్ర‌ల‌తో స‌రిపోల్చ‌గా.. తేడా ఉన్న విష‌యాన్ని గుర్తించారు. వెంట‌నే అదుపులోకి తీసుకొని త‌మ‌దైన శైలిలో విచార‌ణ స్టార్ట్ చేసేస‌రికి.. తాము చేసిన దుర్మార్గాన్ని పోలీసుల‌కు చెప్పేశారు. ఇన్నాళ్లు త‌మ కొడుకే అనుకున్న వ్య‌క్తి సుధాక‌ర్ రెడ్డి కాద‌ని, త‌మ కొడుకు హ‌త్య‌కు గుర‌య్యార‌ని.. చంపింది త‌మ కోడ‌లేన‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేని స్వాతి అత్త‌మామ‌లు భోరున విల‌పిస్తున్నారు. అక్ర‌మ సంబంధం కోసం వారు ఆడిన నాట‌కం ఇపుడు మూడు కుటుంబాల జీవితాల‌ను త‌ల‌కిందులు చేసింది.