Begin typing your search above and press return to search.

ఆర్నెళ్లలో 20 వేల కోట్లు సంపాదించేశాడు

By:  Tupaki Desk   |   13 Oct 2015 9:27 AM GMT
ఆర్నెళ్లలో 20 వేల కోట్లు సంపాదించేశాడు
X
ఆ సంస్థను ప్రారంభించి పది నెలలే అయింది... కానీ, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకే పోటీగా మారిపోయింది... కేవలం పదినెలల కాలంలోనే అదరగొట్టేస్తున్న కంపెనీ అంటే మెగా బిజినెస్ ఫ్యామిలీలకు చెందిన సంస్థ అనుకోవద్దు... ఓ సాధారణ ఎన్నారై స్థాపించిన ఈ సంస్థ బయోటెక్నాలజీ రంగంలో మిగతా సంస్థలకు సవాల్ విసురుతోంది.

29 ఏళ్ల వివేక్ రామస్వామి బోస్టన్ లో బయోటెక్నాలజీ రంగంలో ఉద్యోగం చేసుకుంటుండేవారు. గత ఏడాది డిసెంబరులో ఆయన ఆక్సోవేంట్ సైన్సెస్ అనే సంస్థను స్థాపించారు. 33 కోట్ల రూపాయాలతో ప్రారంబించిన అదిప్పుడు ఆ రంగంలో పెద్దపెద్ద సంస్థలకే పోటీ ఇస్తోంది. అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన మందులను తయారు చేస్తుందీ కంపెనీ. గ్లాక్సో స్మిత్ క్లైం వంటి సంస్థలు కూడా ఎన్నో ఏళ్లు రీసెర్చి చేసి సరైన మందు కనిపెట్లలేక వదిలేయగా రామస్వామి కంపెనీ మాత్రం మంచి మందును తయారుచేసి ఉత్పత్తి చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా గుర్తింపు పొందింది.

రామస్వామి తన మందుకు పేటెంట్ సాధించారు.. మొన్న జూన్ లో అమెరికాలో ఐపీఓకు వచ్చిన ఈ సంస్థకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఏకంగా 19980 కోట్లకు కంపెనీ షేర్లు అమ్ముడు పోయాయి. డిసెంబరులో పెట్టిన కంపెనీకి కేవలం ఆర్నెళ్లలోనే 20 వేల కోట్ల మేర అభివృద్ది సాధించడం సాధారణ విషయం కాదు. రామస్వామి అమెరికా కేంద్రంగా వ్యాపారం చేస్తున్నప్పటికీ ఆయన స్వస్థలం మాత్రం తమిళనాడే. రామస్వామి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని అల్జీమర్స్ కు సంబంధించి విస్తృతంగా అధ్యయనం చేశారు. ఇప్పుడాయన కంపెనీ బడా సంస్థలకే కొరకరాని కొయ్యగా మారినా అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు మాత్రం వరంలా మారింది.