Begin typing your search above and press return to search.

పాదాభివంద‌నం వ‌ద్దంటున్న త‌మిళ నాయ‌కుడు

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:59 PM GMT
పాదాభివంద‌నం వ‌ద్దంటున్న త‌మిళ నాయ‌కుడు
X
నాయ‌కులంటే విప‌రీత‌మైన అభిమానమే కాదు భ‌క్తికి కూడా త‌మిళ‌నాడు పెట్టింది పేరు అనే సంగ‌తి తెలిసిందే. ఏకంగా గుళ్లు క‌ట్టించే స్థాయికి త‌మిళ‌నాడు ఎప్పుడో చేరిపోయింది. అయితే డీఎంకే పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఇలాంటి ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. పార్టీ నేత‌ల‌కు ఆయ‌న‌ ఇచ్చిన పిలుపు ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తరువాత కేడర్‌కు స్టాలిన్‌ ఓ లేఖ రాశారు. కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న త‌న వద్దకు వస్తున్న నేతలు తమను ఆశీర్వదించాలని కోరుతూ కాళ్లపై పడుతుంటే ఇబ్బందిగా ఉంద‌ని పేర్కొంటూ ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని పార్టీ నేత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. తనపై అతి పెద్ద బాధ్యతలు ఉన్నాయని చెబుతూ, నాయకులు ప్రేమానురాగాలతో అభినందనలు తెలియజేయడానికి వస్తున్న వేళ, పలువురు వ్యవహరిస్తున్న తీరు తన మనసును ద్రవింపచేస్తోందని స్టాలిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లిదండ్రులకు తప్ప మరొకరి కాళ్లపై పడి ఆశీర్వాదాలు పొందాల్సిన అవసరం నేతలకు లేదని, ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వాలని భావిస్తే, నమస్కారం చేస్తే చాలని, పాద పూజలు, సాష్టాంగ నమస్కారాలు వద్దని వేడుకున్నారు.

పార్టీకి నిజ‌మైన అభిమానం చూపించ‌డం అంటే ప్ర‌జ‌ల కోసం క‌ష్టించి ప‌నిచేయ‌డ‌మ‌ని పేర్కొన్న స్టాలిన్ ఈ ప‌నిలో నేత‌లు ఉండాల‌ని సూచించారు. త‌న‌కు ఒంగి దండాలు పెట్టడం, కాళ్లపై పడిపోయి పాద పూజలు చేయడం వంటి సంస్కృతి పోయేందుకు ప్ర‌తి ఒక్క‌రు దూరంగా ఉండాల‌ని స్టాలిన్ కోరారు. అందుకు బ‌దులుగా ఒక్క నమస్కారం పెడితే చాలని డీఎంకే నేతలను కార్య నిర్వాహక అధ్యక్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ స్టాలిన్‌ వేడుకున్నారు. నూత‌న నాయ‌కుడి పిలుపు నేప‌థ్యంలో అయినా..అధినేతల దృష్టిలో పడేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ - ఒంగి దండాలు పెట్టడం - మరి కొందరు ఇంకో అడుగు ముందుకు వేసి ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేయడం తమిళనాట రాజకీయాల్లో క‌నిపించ‌దేమో అని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/