Begin typing your search above and press return to search.

ఆ ద్రోహుల్ని సోనియమ్మ ఏమీ అనకున్నా..

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:58 PM GMT
ఆ ద్రోహుల్ని సోనియమ్మ ఏమీ అనకున్నా..
X
తప్పు చేయటానికి ఒక హద్దు ఉంటుంది. బరితెగింపు ఏ మాత్రం మంచిది కాదు.అలా వ్యవహరించిన వారిని సమర్థించకున్నా.. చర్యలు తీసుకోకుండా ఉండటం కూడా నేరమే. ఎంత సొంత పార్టీ వాళ్లు అయినా.. చెత్త పని చేసినప్పుడు.. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచేలా వ్యవహరిస్తే కామ్ గా ఉండటంతో అర్థం లేదు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉరీ ఉగ్రఘటనలో భారత సైనికులు 18 మంది వీరమరణం పొందిన విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు కశ్మీర్ సరిహద్దుల్లోని ఉరీ సైనిక శిబిరం మీద దాడి చేసి.. బలి తీసుకున్నారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని రగిలించేసింది. సైనికుల ప్రాణాలు తీసిన పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పలువురు డిమాండ్ చేయటమే కాదు.. యుద్ధానికి సైతం సై అంటే సై అనేయటం.. సెలబ్రిటీలు సైతం పాక్ తో అమీతుమీ తేల్చుకోవాలంటూ ఆవేశంతో వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ లో ఉరీ ఉగ్రఘటనను ఖండిస్తూ ఒక ర్యాలీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు నివాళి అని చెబుతూ మోరాదాబాద్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహంతో పాక్ అనుకూల నినాదాలు చేయటం దేశ వ్యాప్తంగా ఇదో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రెచ్చిపోతూ పాక్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ ను ఒక న్యూస్ ఛానల్ ప్రసారం చేయటం.. సోషల్ మీడియాలోనూ ఈ ఉదంతంపైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇంత దారుణంగా వ్యవహరించిన ద్రోహులపై కాంగ్రెస్ అధినేత్రి వెంటనే స్పందించి.. సదరు కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ఇప్పటివరకూ ఈ ఉదంతంపై ఎలాంటి స్పందన లేకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. పాక్ కు జిందాబాద్ లు చేసిన ద్రోహులపై తాజాగా యూపీ పోలీసులు దేశ ద్రోహం కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసులు దేశద్రోహం కేసులు పెట్టిన తర్వాత కూడా.. కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం చూస్తే.. పార్టీ చేతకానితనంపై పలువురు మండిపడుతున్నారు.