Begin typing your search above and press return to search.

‘పెద్దాయన’కు అమ్మ నెచ్చెలి పరామర్శ

By:  Tupaki Desk   |   4 Dec 2016 7:51 AM GMT
‘పెద్దాయన’కు అమ్మ నెచ్చెలి పరామర్శ
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని కనిపించని చిత్రమైన పరిస్థితి తమిళనాడులో చోటు చేసుకుందని చెప్పాలి. ఆ రాష్ట్రముఖ్యమంత్రి జయలలిత.. ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత కరుణానిధి అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావటం తెలిసిందే. తొలుత తీవ్ర అనారోగ్యంతో అమ్మ జయలలిత ఆసుపత్రిలో చేరగా.. నెలలతరబడి ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యనే ఆమె ఆరోగ్యం కుదుట పడిందని.. మరికొంత కాలం ఆసుపత్రిలోనే ఉండాలని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల డీఎంకే చీఫ్.. పెద్దాయనగా పిలుచుకునే కరుణ అనారోగ్యానికి గురి కావటం.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చటం జరిగింది. ఇంతకాలం అమ్మకు వెల్లువెత్తిన పరామర్శలు.. ఇప్పుడు కరుణకు షిఫ్ట్ అయ్యాయి. అమ్మకు అత్యంత సన్నిహితురాలు.. నెచ్చెలిగా చెప్పే శశికళ.. తాజాగా కరుణ ఆరోగ్యంపై పరామర్శ చేసినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణ ఆరోగ్య పరిస్థితి బాగానేఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే..కరుణ ఆరోగ్య పరిస్థితిపై శశికళ పరామర్శించినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అనారోగ్యంగా ఉన్న అమ్మను పరామర్శించేందుకు కరుణ కుమారుడు స్లాలిన్ అపోలోకు వెళ్లటం తెలిసిందే. ఆ తర్వాత.. కరుణ సతీమణి రాజాత్తి అమ్మాల్ కూడా అపోలోకు వెళ్లి అమ్మను పరామర్శించినట్లు చెబుతారు. కానీ.. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది లేదు. ఇలాంటి వేళ.. అనారోగ్యానికి పాలైన కరుణను శశికళ పరామర్శించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/