Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట‌ల‌కు టీడీపీ సీనియ‌ర్ ఫిదా!

By:  Tupaki Desk   |   23 Aug 2016 2:54 PM GMT
కేసీఆర్ మాట‌ల‌కు టీడీపీ సీనియ‌ర్ ఫిదా!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల‌కు తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఫిదా అయిపోయారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క స‌ల‌హాదారుల్లో ఒక‌రిగా పేరున్న మాజీ మంత్రి రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఈ మేర‌కు స్వ‌యంగా వెల్ల‌డించారు. అయితే తాను ఫిదా అయింది రెండేళ్ల క్రితం అని పేర్కొంటూ త‌ర్వాతి కాలంలో ఆ ఉద్దేశం మారిపోయింద‌ని చెప్పారు. పైగా ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ రావుల‌ను అంత‌గా అప్‌ సెట్ చేసిన విష‌యం ఏంటంటే మ‌హారాష్ట్రతో తెలంగాణ ఒప్పందం చేసుకోవ‌డ‌మే!

మ‌హారాష్ట్ర స‌ర్కారుతో ఎంఓయూ కుదుర్చుకున్న సంద‌ర్భంపై రావుల మీడియాతో మాట్లాడుతూ 2014 జూన్ 13 న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్ర‌సంగాన్ని గుర్తు చేశారు. "అన్ని పక్షాల నాయకులను విశ్వాసంలోకి తీసుకొని అందరి ఆమోదంతోనే అభివృద్ధి పథకాలను అమలు చేస్తాం. మాకు గర్వం లేదు. ఇగోలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతకన్నా లేవు. తెలంగాణ అభివృద్ధిలో అందరం పాత్రధారులు అవుదాం - సూత్రధారులు అవుదాం. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాడిని, ఒక తప్ప జరిగితే తరతరాలకు నష్టం జరుగుతుందని ఆ తప్ప నేను చేయను" అని చెప్ప‌డాన్ని రావుల ప్ర‌స్తావించారు. "ఆ ప్రసంగం చూసి కేసీఆర్ చరిత్రాత్మక ప్రసంగం చేశారని అనుకున్నాం. కానీ, ఇప్పటి వరకు ఒక్క అఖిలపక్షం జరిగిందా? మొత్తం ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. పరీక్ష రాసిన వారే మార్కులు వేసుకున్నట్లుగా టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరు ఉంది. గతంలో మహారాష్ట్రతో ఎంఒయు జరిగినప్పడు ఒంటెలతో ఊరేగింపుచేశారు. అగ్రిమెంట్ జరుగుతున్న ఈవేళ వేటితో ఊరేగింపు జరుపుకుంటారో చూడాలి." అంటూ రావుల ఎద్దేవా చేశారు.

తాజా ఒప్పందం ద్వారా మహారాష్ట్ర లాభం పొందిందా? తెలంగాణ రాష్ట్రం లాభం పొందిందా? అని ప్రజలకు, రాజకీయ పక్షాలకు తెలియాల్సిన అవసరం లేదా అంటూ కేసీఆర్‌ ను రావుల ప్ర‌శ్నించారు. మహారాష్ట్రతో అగ్రిమెంట్ జరుగుతున్న మూడు ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్టుకైనా డీపీఆర్ ఉందా అంటూ ప్ర‌శ్నించారు. మహారాష్ట్రతో జరుగుతున్న ఒప్పందాన్ని మేము ఆక్షేపిస్తున్నామ‌ని రావుల‌ ప్ర‌క‌టించారు. రాజకీయ కారణంతో చేస్తున్న ఆక్షేపణ కాదని నిపుణులతో చర్చించిన తరువాతనే దీనిని చీకటి ఒప్పందంగా అభివర్ణిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటికైనా మహారాష్ట్రతో వివాదం ఏమిటి? దానిపై పరిష్కారం ఏమొచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.