Begin typing your search above and press return to search.

'ఎవ‌డు' ఎపిసోడ్‌ కు చెక్ పెట్టిన మ‌ట‌న్ సూప్

By:  Tupaki Desk   |   12 Dec 2017 8:53 AM GMT
ఎవ‌డు ఎపిసోడ్‌ కు చెక్ పెట్టిన మ‌ట‌న్ సూప్
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో హ‌ట్ టాపిక్ గా మారిన ఎవ‌డు హ‌త్య వ్య‌వ‌హారంలో కొత్త కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వివాహేత‌ర సంబంధం మోజులో ప‌డి భ‌ర్త‌ను చంపేయ‌ట‌మే కాదు.. బంగారం లాంటి కుటుంబాన్ని నాశ‌నం చేసుకొన్న స్వాతి ఇప్పుడు జైల్లో ఉచ‌లు లెక్కేసే దుస్థితి.

టీవీ సీరియ‌ల్స్‌తో ప్ర‌భావం.. ఎవ‌డు సినిమా స్ఫూర్తితో ప్రియుడి కోసం భ‌ర్త‌ను చంపేసిన స్వాతి.. రాజేశ్ ల వ్య‌వ‌హారం ఎలా బ‌య‌ట‌కు పొక్కింద‌న్న విష‌యం మీద ఆస‌క్తిక‌ర విష‌యం ఇప్పుడు వెలుగు చూసింది. ముఖం మీద కాలిన దెబ్బ‌ల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్.. త‌న‌ను తాను సుధాక‌ర్ రెడ్డిగా చెప్పుకుంటున్న ఎపిసోడ్ లో వారి త‌ల్లిదండ్రుల అనుమానాల‌కు మ‌ట‌న్ సూప్ బ‌లం చేకూర్చింది.

మ‌ట‌న్ సూప్ ఏమిటి? హ‌త్య నాట‌కాన్ని బ‌య‌ట‌పెట్ట‌టం ఏమిటంటే.. ఆసుప‌త్రి బెడ్ లో కాలిన గాయాల‌తో ఉన్న వ్య‌క్తి త‌మ కొడుకు కాద‌న్న సందేహం సుధాక‌ర్‌ రెడ్డి త‌ల్లిదండ్రులకు వ‌చ్చింది. త‌మ కొడుక్కి ఎంతో ఇష్ట‌మైన మ‌ట‌న్ సూప్ ను తీసుకొచ్చి ఆసుప‌త్రిలో ఉన్న రాజేశ్‌ కు పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. సుధాక‌ర్ రెడ్డి గా చెప్పుకుంటున్న రాజేశ్ పూర్తిగా శాఖాహారి. దీంతో మ‌ట‌న్‌ సూప్ తిన‌న‌ని చెప్ప‌టంతో అప్ప‌టి దాకా ఉన్న సందేహం మ‌రింత బ‌ల‌ప‌డింది.

కాలిన గాయాల‌తో చికిత్స పొందుతున్న‌ది త‌మ కొడుకు కాద‌ని.. త‌మ కొడుకు పేరుతో చెప్పుకుంటున్న ఇంకెవ‌రైనా అయి ఉంటార‌న్న డౌట్ ను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ జ‌ర‌ప‌టంతో దారుణ‌మైన హ‌త్య ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలా పరాయి మ‌గాడి మోజులో ప‌డిన స్వాతి.. ఆమెను ట్రాప్ లోకి దించిన రాజేశ్ ఇద్ద‌రూ పోలీసుల‌కు దొరికిపోయారు.