Begin typing your search above and press return to search.

త‌ప్ప‌ని తేలితే ఉరికి సిద్ధ‌మంటున్న కోమ‌టిరెడ్డి

By:  Tupaki Desk   |   22 April 2017 5:55 PM GMT
త‌ప్ప‌ని తేలితే ఉరికి సిద్ధ‌మంటున్న కోమ‌టిరెడ్డి
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన‌ సవాల్‌ విసిరారు. టీఆర్ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసేవారిపై కేసులు పెట్టాలంటూ సూచించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఘాటుగా రియాక్టయ్యారు. అన్ని శాఖల్లోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఓ స్కామ్‌ అని పేర్కొన్న కోమటిరెడ్డి, అమృత్ పథకంలోనూ అవినీతి జరిగిందని కోమ‌టిరెడ్డి విమ‌ర్శించారు.

తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రభుత్వ శాఖల్లో అవినీతి జ‌రుగుతోంద‌ని పున‌రుద్ఘాటించారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక‌వేళ త‌న‌ ఆరోపణలు తప్పని తేలితే త‌న‌పై కేసు పెట్టాల‌ని అన్నారు. జైలుకు వెళ్లడానికైనా.....ఉరిశిక్షకైనా సిద్ధమంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచ‌లన‌ సవాల్ విసిరారు.

కాగా, మ‌రో సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి సైతం సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు. ప్లీనరీ పెట్టి తమను ఉద్దరిస్తారని రైతులు ఎదురు చూస్తే....రైతును రాజును చేస్తాననే ఒక్క మాట తప్ప ఆదుకునే హామీ ఒక్కటీ ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు. త్వరలో ఎన్నికలు వస్తాయనే ఉచిత ఎరువుల పథకం ప్రకటించారే తప్ప రైతు మీద ప్రేమ ఉండి కాదని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేల కోసం రైతులు ఎదురు చూడటంలేదని.. గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతున్నారని ఆయన డిమాండ్ చేశారు. ప్లీన‌రీ పార్టీ నాయ‌కుల కోసం త‌ప్ప ప్ర‌జ‌ల కోసం కాద‌ని విమ‌ర్శించారు.