Begin typing your search above and press return to search.

పాక్ లోని హిందువులకు ఎంత దారుణ పరిస్థితి అంటే..

By:  Tupaki Desk   |   18 Aug 2019 11:56 AM GMT
పాక్ లోని హిందువులకు ఎంత దారుణ పరిస్థితి అంటే..
X
ఒక దేశంలో పుట్టిన మైనార్టీలు ఆ దేశంలో తమ పెళ్లిని చేసుకోవటానికి కూడా ఇబ్బంది పడే దారుణ పరిస్థితి ఉంటుందా? అంటే.. ఎవరైనా నో చెబుతారు. అందునా భారత్ లాంటి దేశంలో మైనార్టీలకు ఉండే అదనపు సౌకర్యాలు.. చట్ట రక్షణ ఎంతో ఉంటుంది. కానీ.. మన పొరుగున ఉండే దాయాది దేశంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్న షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది.

పాకిస్థాన్ లో హిందువుల సంఖ్య చాలా తక్కువ. ఉన్న కాస్త మందికి విపరీతమైన వేధింపులు.. ఇబ్బందులు ఎదురుకావటంతో వాళ్లల్లో చాలామంది మతం మారిపోతే.. మరికొందరు విదేశాలకు వెళ్లిపోయరు. అటు ఇటు కాకుండా ఉండిపోయి.. తాము నమ్మిన మతంలోనే కొనసాగుతున్న వారంతా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఇప్పుడు బయటకు వచ్చింది.

పాక్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన కరాచీకి చెందిన రెండు హిందూ జంటలు గుజరాత్ వచ్చి మరీ పెళ్లి చేసుకున్నాయి. సొంత దేశంలో పెళ్లి చేసుకోకుండా.. పరాయి గడ్డకు వచ్చి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఇదేమైనా డెస్టినేషన్ వెడ్డింగా? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. సొంత దేశంలో తాము పెళ్లి చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు భారత్ కు వచ్చి పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు.

ఎందుకిలా అంటే.. పాక్ లో నివసించే హిందువులకు పలు ఇబ్బందులు ఎదురవుతాయని.. అక్కడ డబ్బులు బాగా సంపాదిస్తున్న హిందువులు సైతం ఇబ్బందికర జీవితాన్ని అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ లో హిందువుల పెళ్లిళ్లు ఎలాంటి హంగామా లేకుండా జరుగుతాయని.. దీనికి కారణం అక్కడి పరిస్థితులేనని చెబుతున్నారు. ఈ కారణంతోనే పాక్ కు చెందిన హిందువులు భారత్ కు వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ లోని ఇతర నగరాలతో పోలిస్తే కరాచీలో ఎక్కువమంది హిందువులు నివసిస్తున్నారని.. దాదాపుగా మూడు వేలకు పైగా కుటుంబాలు ఉన్నాయని చెబుతున్నారు.

పాక్ హిందువులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా మహేశ్వరి సమాజం పేర్కొంటోంది. ఈ సమాజం అధ్యక్షుడు భవేష్ మహేశ్వరి మాట్లాడుతూ.. పాక్ లో హిందూ జంటలు పెళ్లి చేసుకోవటం ఇబ్బందిగా ఉందని.. ఆ కారణంతోనే తాము రాజ్ కోటకు వచ్చి పెళ్లి వేడుకలు చేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇప్పటివరకూ పాక్ నుంచి 90 జంటలు రాజ్ కోట్ కు వచ్చి పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నారు. అయితే.. తమకు భారత్ లో ఉండే అవకాశం ఇస్తే.. తామంతా వచ్చేస్తామని ఈ సమాజంలోని పలువురు చెప్పటం గమనార్హం.