Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి విలువ పోగొట్టుకున్నాడు: జగ్గారెడ్డి

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:04 PM GMT
రేవంత్ రెడ్డి విలువ పోగొట్టుకున్నాడు: జగ్గారెడ్డి
X
హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక కాంగ్రెస్ పార్టీని నిట్టనిలువునా చీల్చేస్తోంది. ఆ టికెట్ ఉత్తమ్ భార్యకు కేటాయించడంతో ఉత్తమ్‌కు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం వ్యవహరిస్తోంది. హుజూర్ నగర్ టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారు.

అయితే.. రేవంత్ అలా విమర్శలు చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పుపట్టారు. హుజుర్‌నగర్ ఎమ్మెల్యే ఎంపిక విషయంలో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి అనవసరంగా తన స్థాయిని దిగజార్చుకున్నారని ఆయన అన్నారు. పార్టీలో ఉన్న ఆ కొద్దిపాటి విలువ కూడా ఆయన పోగొట్టుకున్నారని విమర్శించారు. ఎదుగుతున్న సమయంలో పార్టీ నేతల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇబ్బందుల్లో పడ్డాడని ఆయన అన్నారు.

మరోవైపు ఇటివల మంత్రి హరీష్ రావును కలిసిన అంశంపైనా ఆయన మరోసారి స్పష్టత ఇచ్చారు. అభివృద్ది పనుల కోసమే మంత్రి హరీష్ రావుతో భేటి అయినట్టు ఆయన తెలిపారు. రాజకీయ వైరంతో పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న టీఆర్ఎస్ నేత హరీశ్ రావు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిన్న కలుసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల తర్వాత హరీశ్ రావుతో జగ్గారెడ్డి మాట్లాడటం రాజకీయంగా చర్చ నీయాంశమైంది.

దీనిపై జగ్గారెడ్డి స్పందిస్తూ సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించేందుకే నిన్న హరీశ్ రావుని కలిసినట్టు చెప్పారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఇకపై తనకు ఎలాంటి ఘర్షణ ఉండదని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మరోమారు ప్రజలు గెలిపించి అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు.