Begin typing your search above and press return to search.

ఇండియాలో నేరాలు.. విదేశాల్లో విహారాలు

By:  Tupaki Desk   |   20 Feb 2018 5:30 PM GMT
ఇండియాలో నేరాలు.. విదేశాల్లో విహారాలు
X
లలిత్ మోదీ.. విజయ్ మాల్యా.. నీరవ్ మోదీ.. అందరిదీ అదే కథ.. భారత్‌ లో మోసాలు - విదేశాల్లో విలాసాలు. ఇండియాలో నేరాలు చేసి విదేశాలకు పారిపోతే చాలు.. తిరిగి వారిని స్వదేశానికి రప్పించడం భారత్ అధికారులకు సవాలే. నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్నా కూడా ఫలితం లేకుండా పోతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి - రూ.11 వేల కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ ఈ గుట్టు బయటపడేసరికే దేశం దాటేశారు. ఇంతకుముందు విజయ్ మాల్యా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రూ.9,091కోట్ల రుణం తీర్చకుండా బ్రిటన్ చెక్కేశారు. ఎట్టకేలకు ఆయన్ను ఏడాది తరువాత అరెస్టు చేసినా ఆయన్నుంచి డబ్బు రాబట్టడంలో కానీ - కనీసం ఆయన్ను స్వదేశానికి తేవడంలో కానీ సఫలం కాలేకపోయారు. విదేశాల్లో తలదాచుకుంటున్న నేరస్థుల సంఖ్యతో పోల్చితే, తిరిగి రప్పిస్తున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.
విదేశాలకు పారిపోయిన నిందితులను రప్పించాలంటే ఆయా దేశాలతో నేరస్థుల అప్పగింత ఒప్పందాలు ఉండాలి. భారత్‌ కు అలాంటి ఏర్పాట్లు కొద్ది దేశాలతో మాత్రమే ఉన్నాయి. దీంతో కొందరు నేరగాళ్లు ఇలాంటి ఒప్పందాలు లేని దేశాలకు పారిపోయి అక్కడ నుంచి తమ కార్యకలాపాలు సాగించడమో.. శేష జీవితం గడిపేయడమో చేస్తున్నారు. మరోవైపు ఒప్పందాలున్న దేశాల నుంచి నిందితులను రప్పించడంలోనూ అనేక అవాంతరాలు ఎదురవుతుండడంతో ఏటా అతి తక్కువ మందిని మాత్రమే తిరిగి రప్పించగలుగుతున్నారు.

భారత్‌ తో నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్న దేశాల్లో 9 మాత్రమే తమ దేశాలకు వచ్చిన భారత నిందితులను బేషరతుగా అప్పగిస్తున్నాయి. తమ దేశంలో వారు ఎలాంటి నేరానికి పాల్పడనప్పటికీ పట్టుకుని అప్పగిస్తున్నాయి. మిగతావి మాత్రం తమ దేశాల్లో వారిపై కేసులుంటేనే భారతదేశ అభ్యర్థనలను పరిశీలించి అప్పగింతకు చర్యలు తీసుకుంటున్నాయి.

*మన దేశంతో నేరస్థుల అప్పగింత ఒప్పందాలు - ఏర్పాట్లు ఉన్న దేశాలు మొత్తం 51.

*అందులో అభ్యర్థనలు - పరస్పర అవగాహన - న్యాయప్రక్రియ ప్రకారం అప్పగించే ఏర్పాట్లున్న దేశాలు 9

*భారతదేశంలో కేసులున్నా కూడా తమ దేశంలో కూడా సదరు నేరస్థులపై కేసులున్నప్పుడు మాత్రమే అప్పగించే దేశాలు 42

*విదేశాలకు పారిపోయిన నిందితులను భారత్‌కు రప్పించే ప్రక్రియ ‘భారత నేరస్థుల అప్పగింత చట్టం - 1962’ ప్రకారం జరుగుతుంది.

ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయినవారిలో అతికొద్దిమందిని మాత్రమే తిరిగి భారత్‌కు రప్పించగలిగారు. భారీ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు వెళ్లిపోయినవారిలో అయిదుగురిని మాత్రమే గత పదిహేనేళ్ల కాలంలో(2002 నుంచి 2017 మధ్య) తిరిగి భారత్‌ కు తీసుకొచ్చారు.

* రవీంద్ర రస్తోగీ: 2003లో రస్తోగీని అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్‌కు రప్పించారు.

* అశోక్ తాహిల్ రామ్: హాంకాంగ్ నుంచి 2003లో ఈయన్ను పట్టుకొచ్చారు.

* షర్మిల షాన్‌ బాగ్: 2004లో షర్మిలను జర్మనీ భారత్‌కు అప్పగించింది.

* ఏఎన్ ఘోష్: 2007లో జర్మనీ నుంచి తీసుకొచ్చారు.

* నరేంద్ర రస్తోగీ: 2008లో అమెరికా నుంచి తీసుకొచ్చారు.

ఎక్కువ మంది ఇంగ్లండ్‌ లోనే..

భారత్‌ లో భారీ నేరాలకు పాల్పడినవారిలో ఎక్కువమంది ఇంగ్లండ్ పారిపోతున్నారు. నిజానికి బ్రిటన్‌ తో భారత్‌ కు నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్నా నిందితులను స్వదేశానికి రప్పించడం మాత్రం సాధ్యం కావడం లేదు.

ఎవరెక్కడ..?

టైగర్‌ హనీఫ్‌: 1993 బాంబు పేలుళ్లు. బ్రిటన్‌ లో ఉంటున్నాడు.

నదీం సైఫీ: 1997 నాటి గుల్షన్‌ కుమార్‌ హత్య కేసు. బ్రిటన్‌ పారిపోయాడు.

రవిశంకరన్‌: 2006 నాటి నావికాదళ వార్‌ రూం సమాచారం లీకేజి కేసు. బ్రిటన్‌లో దాక్కున్నాడు.

లలిత్‌ మోదీ: మనీ లాండరింగ్‌ కేసు. బ్రిటన్‌లో ఉంటున్నాడు.

విజయ్ మాల్యా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకు పైగా రుణం ఎగ్గొట్టి బ్రిటన్‌ లో ఉంటున్నాడు.

దావూద్‌ ఇబ్రహిం: ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసు. దుబాయి - పాకిస్థాన్‌ లలో ఉంటుంటాడు.

హఫీజ్‌ సయీద్‌: 26/11 ముంబయి దాడులు. పాకిస్థాన్‌లో నివాసం.

డేేవిడ్‌ హెడ్లీ: 26/11 ముంబయి దాడులు. అమెరికాలో ఉంటున్నాడు.

కాగా విదేశాల నుంచి రప్పించినవారిలో ఎక్కువమంది ఉగ్రవాద నేరాలకు పాల్పడ్డవారే.

గత పదిహేనేళ్లలో రప్పించిన మోస్ట్‌ వాంటెడ్‌ నేరగాళ్లు..

అబు సలేం: 1993 నాటి ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు. పోర్చుగల్‌ నుంచి రప్పించారు.

దేవీందర్‌ పాల్‌ సింగ్‌ భుల్లార్‌: 1993 దిల్లీ కారు బాంబు కేసులో నిందితుడు, జర్మనీ నుంచి తీసుకొచ్చారు.

చోటా రాజన్‌: హత్యలు - బలవంతపు వసూళ్లు - మాదక ద్రవ్యాల అక్రమరవాణా కేసు. ఇండోనేసియాలో పట్టుకుని తీసుకొచ్చారు.

యాసిన్‌ భత్కల్‌: 2007 - 08లో బాంబుపేలుళ్ల కేసులు. నేపాల్‌ లో పట్టుకుని తీసుకొచ్చారు.

టాప్ 5 కంట్రీస్

* అత్యధికంగా అరబ్ ఎమిరేట్స్ నుంచి 17 మందిని తీసుకొచ్చారు.

* ఆ తరువాత అమెరికా నుంచి ఎక్కువగా 11 మందిని తీసుకొచ్చారు.

* కెనడా నుంచి నలుగురిని.. దక్షిణాప్రికా - జర్మనీల నుంచి ముగ్గురు చొప్పున స్వదేశానికి రప్పించారు.

విదేశాలకు పారిపోయినవారిలో హత్యారోపణలు ఉన్నవారే అధికం

మన దేశం నుంచి ఇతర దేశాలకు పారిపోయిన నేరగాళ్లలో ఎక్కువమంది హత్యా నేరం అభియోగాలున్నవారే. అలాగే, తిరిగి రప్పించినవారిలోనూ వారి సంఖ్యే అధికం. 2002-15 మధ్య మొత్తం 60మందిని స్వదేశానికి రప్పించగా వారిలోనూ హత్యానేరాలు ఉన్నవారే ఎక్కువమంది ఉన్నారు. హత్యానేరాల్లో ఉన్నవారు 10 మంది ఉండగా, ముంబయి పేలుళ్ల నిందితులు సహా ఉగ్ర నేరాల్లో ఉన్నవారు 9 మంది ఉన్నారు. గత పదేళ్లలో అత్యధికంగా 2015లో 8 మందిని భారత్‌కు తీసుకొచ్చారు.