Begin typing your search above and press return to search.

దేవుళ్లకు ఆరు లక్షల కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   3 Aug 2015 6:33 AM GMT
దేవుళ్లకు ఆరు లక్షల కోట్ల నష్టం
X
దేశవ్యాప్తంగా దేవుళ్లంతా ఆరు లక్షల కోట్ల రూపాయలు లాసయ్యారట... భక్తుల సంఖ్య తగ్గో.. ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కావడమో... దొంగలు ఎత్తుకెళ్లడం వల్లో కాదిది.... బంగారం ధర పడిపోవడం వల్ల వచ్చిన నష్టమిది.. అవును.. బంగారం ధర తగ్గిపోవడం వల్ల దేశంలోని ఆలయాల సంపదలో ఆరు లక్షల కోట్ల వేల్యూ తగ్గిపోయింది. సాధారణంగా సెన్సెక్స్‌ ఒడిదుడుకులకు అనుగుణంగా దేశ సంపదను లెక్కిస్తారు. భారీ పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థల విలువను గుణిస్తారు. ఈ సంస్థల్లో ఎవరి ప్రమేయం లేకుండానే సెన్సెక్స్‌ విలువ ఆధారంగా వీటి ఆస్తుల విలువల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. అదే రీతిలో దేశంలో అత్యంత విలువైన మారకంగా పరిగణిస్తున్న బంగారం గత ఏడాదికాలంగా తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. భారత్‌లో ఆల యాలకు భక్తులిచ్చే కానుకలు అత్యధికం బంగారం రూపంలోనే ఉంటాయి. నగదు తర్వాత బంగారానిదే పైచేయి. అతిపెద్ద ఆలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాలు కూడా దేవతారూ పాల్ని బంగారంతోనే అలం కరిస్తారు. ప్రపంచంలోనే బంగారాన్ని అత్య ధికంగా కలిగిన ఆధ్యాత్మిక సంస్థలున్న దేశం భారత్‌. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తాజా అధ్యయనం మేరకు భారత్‌లోని అన్ని ఆలయాల్లో కలిపి సుమారు 20వేల టన్నుల బంగారం నిల్వలున్నాయి. వీటిలో కొన్నింటిని బ్యాంకుల్లో డిపాజి ట్లు చేసినప్పటికీ దాదాపు 80 శాతం నిల్వల్ని ఆలయాల్లోనే అలంకరణలు గా వినియోగిస్తున్నారు.

దేశంలో అత్యధిక బంగారపు నిల్వలున్న ఆలయం త్రివేండ్రంలోని పద్మనాభస్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలో సుమారు 3వేల టన్నులకు పైగా నిల్వలున్నాయి. ఏడాది క్రితం అప్పటి బంగారం ధరను బట్టి వీటి విలువ లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనాలేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతినెలా 80నుంచి 100కిలోల బంగారం వివిధ రూపాల్లో భక్తుల ద్వారా సమకూరు తోంది. హిందూ ఆధ్యాత్మిక ఆలయాల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు స్వామి కమలానంద భారతి అధ్యయనం మేరకు టిటిడి రూ.70వేల కోట్ల విలువైన బంగారాన్ని ఇటుకలు, బిస్కెట్లు, నాణాలు, ఆభరణాల రూపంలో నిక్షిప్తం చేసింది. ఇదికాక ముంబై స్టేట్‌బ్యాంక్‌లో 2,275కిలోలు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో 1353కిలోల బంగారాన్ని డిపాజిట్‌ చేసింది. తాజాగా ఇటీవలె మరో 493కిలోల బంగారాన్ని హైదరాబాద్‌ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో ధరావతు చేసింది. తీరాచూస్తే అప్పటి బంగారం విలువపై 1.61వడ్డీని మాత్రమే బ్యాంకులు టిటిడికి చెల్లిస్తున్నాయి. అలాగే కేరళలోని గురువాయర్‌ దేవస్థానానికి 600కిలోల బంగారు నిల్వలున్నాయి. శబరిమలై అయ్యప్పస్వామివారి దేవస్థానానికి ఏటా రూ.105కోట్ల నగదుతో పాటు 15కిలోల బంగారం అదనంగా వచ్చిచేరుతోంది. ముంబైలోని సిద్ధివినాయక ఆలయానికి 140కిలోల బంగారపు నిల్వలున్నాయి. షిర్డీ సాయిబాబా సంస్థానానికి 120కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి సుమారు 1200కిలోల బంగారపు నిల్వలు ఉన్నాయి. ఇవికాక దేశంలోని దాదాపు 80వేల ఆలయాల్లో ప్రతిదానికి అంతో ఇంతో బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 20వేల టన్నులు అవుతాయని అధ్యయనంలో తేలింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో గ్రాము బంగారం ధర రూ.2,615లు పలికింది. ఈ ఏడాది జులై 31నాటికిది రూ.2,254లుగా నమోదైంది. ఆగస్టు 2నాటి ధరను ఏడాది క్రితం నాటి ధరలతో పోలిస్తే బంగారం ధరలో 14.55శాతం క్షీణించింది. ఆరుమాసాల క్రితంనాటి ధరలతో పోలిస్తే 14.21శాతం తగ్గింది. ఆఖరకు గతనెల సరిగ్గా ఇదే రోజునాటి ధరతో పోల్చినా 6.34శాతం తగ్గింది. ఏడాది కాలంలో సగటున గ్రాముపై రూ.300లకు పైగా తగ్గుముఖం పట్టింది. ఇలా లెక్కిస్తే గ్రాముకు 300చొప్పున కిలో బంగారంపై 3లక్షలు తగ్గింది. టన్నుకు 30లక్షలు తగ్గింది. మొత్తం ఆలయాల్లోని 20వేల టన్నుల బంగారంపై ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ తగ్గింది. ఆ విధంగా భారత్ లో దేవుళ్ల సంపదలో భారీగా తగ్గుదల నమోదైందన్న మాట.