Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో ముస్లిం తీవ్ర‌వాదులు..కేంద్ర‌మంత్రి క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   23 Jun 2018 10:37 AM GMT
రాష్ట్రంలో ముస్లిం తీవ్ర‌వాదులు..కేంద్ర‌మంత్రి క‌ల‌క‌లం
X
కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తున్న త‌మిళనాడు గురించి మ‌రో వివాదాస్ప‌ద‌ విస్మ‌య‌క‌ర అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. నాగర్‌కోయిల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమిళనాడులో తీవ్రవాదులు ఎక్కువ అవుతున్నారని ఆరోపించారు. జల్లికట్లు కోసం జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఇదే నిజమైందన్నారు. ఈ అంశం గురించి చాన్నాళ్లుగా మాట్లాడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు తమిళనాడు అడ్డగా మారుతోందన్న కేంద్ర‌మంత్రి వ్యాఖ్యలపై తీవ్రనిరసన తెలిపిన అన్నాడీఎంకే మంత్రులు, రాష్ట్రం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు.

కొండ ప్రాంతాల్లో నక్సల్స్ శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర‌మంత్రి అయిన రాధాకృష్ణ‌న్‌ ఆరోపించారు. ఎందుకు రాష్ట్రం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నక్సల్స్, మావోయిస్టులు - ముస్లీం తీవ్రవాదులు కొన్ని మీడియా సంస్థల్లోనూ చొరబడినట్లు ఆయన తెలిపారు. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. శుక్రవారం రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘ఉగ్రమూకల చేతిలో తమిళనాడు నాశనమైపోవడాన్ని ఓ తమిళుడిగా తాను చూడలేను’ అని ఆయన పేర్కొన్నారు.

స‌హ‌జంగా వివాదాల‌కు దూరంగా ఉండ‌ట‌మే కాకుండా...సున్నిత మ‌న‌స్కుడిగా రాధాకృష్ణ‌న్‌ కు పేరుంది. ఫిబ్రవరి 2న ప్రధాని మోడీ తమిళనాడులో ఒక రోజు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాధాకృష్ణన్ రాష్ర్టానికి వచ్చిన సంద‌ర్భంగా త‌న పెద్ద‌మ‌న‌సును చాటుకున్నారు. తమిళనాడులోని వెల్లలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన స్థలం వైపు నుంచి వెళ్తున్న రాధాకృష్ణన్ నెత్తుటి మడుగులో ఉన్న ఇద్దరు యువకులను చూసి తన వాహనాన్ని ఆపివేశారు. వెంటనే తీవ్రగాయాలతో ఉన్న యువకులను తన వెంట వచ్చిన పోలీస్ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు.