Begin typing your search above and press return to search.

రెబ‌ల్ స్టార్‌ కు టికెట్ - పార్టీ ఆఫీసు ధ్వంసం

By:  Tupaki Desk   |   16 April 2018 2:03 PM GMT
రెబ‌ల్ స్టార్‌ కు టికెట్ - పార్టీ ఆఫీసు ధ్వంసం
X
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఇప్ప‌టికే అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటుండ‌గా...తాజాగా పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఈ వేడిని మ‌రింత పెంచాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చేనెల 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా విష‌యంలో కర్ణాటకకు చెందిన పలువురి కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. శాసనసభ ఎన్నికల్లో టికెట్లు రాని అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రెబ‌ల్ స్టార్ అంబ‌రీష్‌కు టికెట్ కేటాయించారు. అయితే అంబరీష్ కు టిక్కెట్ కేటాయించడానికి వ్యతిరేకిస్తూ అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ర‌వి గ‌ణిగ అనే పార్టీ నేత అనుచ‌రులు విధ్వంసం సృష్టించారు.

224 అసెంబ్లీ స్థానాలకు 218 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. చాముండేశ్వరి స్థానం నుంచి సీఎం సిద్దరామయ్య - కోరాటెగెరె నుంచి పీసీసీ అధ్యక్షుడు జీ పరమేశ్వర పోటీ చేస్తారు. జాబితాలో కొందరు మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. ఇదే జ‌బితాలో అంబ‌రీష్‌కు టికెట్ కేటాయించ‌డాన్ని మండ్య పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోకి చోరబడిన కార్యకర్తలు ఫర్నీచర్, కంప్యూటర్లు ద్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. రవి గణిగకు టిక్కెట్ కేటాయించాలని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.2013 శాసన సభ ఎన్నికల సమయంలో మండ్య నుంచి రెబల్ స్టార్ అంబరీష్, రవి గణిగ ఇద్దరూ పోటీ చెయ్యడానికి ప్రయత్నించారని ఆ సమయంలో ఈ శాసనసభ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అని చెప్పారని, అందుకే అప్పట్లో తాను పోటీ నుంచి తప్పుకున్నానని, అంబరీష్ ఇప్పుడు మళ్లీ టిక్కెట్ సంపాధించుకున్నారని సోమవారం మీడియా ముందు రవి గణిగ ఆరోపించారు.

మండ్య శాసన సభ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేస్తానని, టిక్కెట్ ఇవ్వాలని అంబరీష్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ద‌ర‌ఖాస్తు కూడా చేయ‌లేద‌ని అయిన‌ప్ప‌టికీ...ఆయ‌న‌కు టికెట్ కేటాయించి త‌న‌కు అన్యాయం చేశార‌ని ర‌వి ఆరోపించారు. మాండ్య నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ప్ప‌కుండా పోటీ చేస్తాన‌ని, అబ‌రీష్‌ను ఓడిస్తాన‌ని ర‌వి గ‌ణిగ ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల్లో అంబ‌రీష్ గెలుపుకోసం ప్ర‌యత్నించిన‌ప్ప‌టికీ ఆయ‌న మోసం చేసే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం అన్యాయ‌మ‌ని పేర్కొన్నారు.