Begin typing your search above and press return to search.

మోడీ స‌న్నిహితుడికి అగ్రీగోల్డ్ భూములు?

By:  Tupaki Desk   |   11 Sep 2017 1:19 PM GMT
మోడీ స‌న్నిహితుడికి అగ్రీగోల్డ్ భూములు?
X
తెలుగు రాష్ర్టాలే కాకుండా..పొరుగు రాష్ర్టాల్లో కూడా లక్షలాదిమందిని నిర్ధాక్షిణ్యంగా మోసగించిన అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయం కొలిక్కి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ కుంభకోణం ఓ పెద్ద చరిత్ర. ఏకంగా 32లక్షల 02వేల 607మంది అగ్రిగోల్డ్‌ కారణంగా మోసపోయారు. ఇందులో 19.52లక్షల మంది రెండు తెలుగురాష్ట్రాలకు చెందినవారు కాగా ఏడు రాష్ట్రాల్తో పాటు అండమాన్‌నికోబార్‌లకు చెందిన ధరావతుదార్లు మరో 13లక్షల మంది వరకు ఉన్నారు. డిపాజిట్లకు బదులుగా భారీ ఎత్తున లాభాలి స్తామని ఆశచూపి వీరందర్నీ అగ్రిగోల్డ్‌ మోస పుచ్చింది. వీరిలో పలువురు ఆర్ధికంగా దివాళా తీస్తే కొందరు ఆత్మహత్యల పాలయ్యారు. మరికొందరు మతిస్థిమితం కోల్పోయారు.

2014నవంబర్‌ లో ఈ కుంభకోణం బట్టబయలైంది. అప్పట్నుంచి దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. అగ్రిగోల్డ్‌ నిర్వాహకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పేరిట ఉన్న ఆస్తుల వివరాల్ని సేకరించారు. అగ్రిగోల్డ్‌ పేరిట సుమారు ఆరువేల కోట్ల ధరావతుల్ని సమీకరించారు. సుమారు 21 ఏళ్ళుగా ఈ మొత్తాన్నే పెట్టుబడిగా పెట్టి రియల్ ఎస్టేట్‌ - డైరీ - రిసార్డ్స్‌ - ఎంటర్‌ టైన్‌ మెంట్‌ - ఫైనాన్స్‌ - తోటల పెంపకం వంటి వ్యాపారాలు చేశారు. మరోవైపు భవన నిర్మాణంలో పెద్దెత్తున పెట్టుబడులు పెట్టారు. దేశంలోని పలు నగరాల కీలక కేంద్రాల్లో కార్యాలయ సముదాయాల్ని సొంతంగా నిర్మించుకున్నారు. ఇప్పుడు వీటన్నింటి మార్కెట్‌ విలువ పెరిగింది. మార్కెట్లో వీటి విలువ మొత్తం ధరావతుల్తో పోలిస్తే ఐదారురెట్లుంటుంది. అయితే సహజంగానే మార్కె ట్‌ విలువకు - పుస్తక విలువకు మధ్య తీవ్ర వ్యత్యాస ముంటుంది. పుస్తక విలువబట్టి లెక్కెట్టి ఈ స్థిరాస్తుల్ని కైవసం చేసుకునేందుకు అనేక మంది పోటీలు పడుతున్నారు.

సాక్షాత్తు ముఖేష్‌ అంబానీ - మరికొందరు అతిపెద్ద పారిశ్రామికవేత్త కూడా అగ్రిగోల్డ్‌ ను తమకప్పగిస్తే ధరావతుదార్ల బకాయిల్ని తీర్చేయడంతో పాటు సంస్థను సమర్థ‌వంతంగా నిర్వహిస్తామంటూ న్యాయస్థానానికి అర్జీలు పెట్టుకున్నారు. తాజాగా మరికొందరు పారిశ్రామికవేత్తలు అగ్రిగోల్డ్‌ ను హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని బాగా స‌మ‌ర్థించే మీడియా మొఘ‌ల్ సుభాష్ చంద‌ర్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. జీ గ్రూప్ పేరుతో మీడియా సంస్థ‌ల‌ను నిర్వ‌హిస్తున్న సుభాష్ చంద‌ర్ అగ్రీగోల్డ్ భూముల‌పై ఆస‌క్తిని చూపించార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల మంత్రివ‌ర్గ స‌మావేశంలో చెప్పిన‌ట్లు స‌మాచారం. మంత్రివ‌ర్గ స‌మావేశానికి ముందే ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుభాష్ చంద‌ర్‌కు అగ్రీగోల్డ్ ఆస్తులు క‌ట్ట‌బెట్టే విధంగా ఏపీ స‌ర్కారు క‌దులుతోంద‌ని అంటున్నారు. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రావ‌చ్చున‌ని చెప్తున్నారు.