Begin typing your search above and press return to search.

అర్న‌బ్‌ పై 500 కోట్ల దావా వేసిన మ‌త‌గురువు

By:  Tupaki Desk   |   30 July 2016 2:38 PM GMT
అర్న‌బ్‌ పై 500 కోట్ల దావా వేసిన మ‌త‌గురువు
X
త‌న హాట్ హాట్ ప్ర‌శ్న‌ల‌తో చ‌ర్చ‌ల్లో కూర్చున్న వారిని ముప్పుతిప్ప‌లు పెట్టే టైమ్స్ నౌ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి ఊహించ‌ని ఝ‌ల‌క్ త‌గిలింది. అది కూడా ఆయ‌న జ‌ర్న‌లిజం వృత్తిని ఉద్దేశించే కావ‌డం వ‌ల్ల ఆస‌క్తిక‌రం. విద్వేష ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మతబోధకుడు జకీర్ నాయక్ అర్న‌బ్‌పై కేసు వేశారు. త‌న‌పై పగతో - ప‌రువు తీసేలా ప్ర‌చారం చేశాడ‌ని ఆరోపిస్తూ ఏకంగా రూ.500 కోట్ల పరువునష్టం దావాను అర్న‌బ్‌ పై వేశాడు.

రంజాన్ మాసంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్ర‌వాదులు సృష్టించిన మార‌ణ‌కాండ స‌మ‌యంలో జ‌కీర్ నాయ‌క్ తెర‌మీద‌కు వ‌చ్చాడు. ఈ బీభత్సం సృష్టించి 22 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు ముంబై కేంద్రంగా 'పీస్ టీవీ' చానెల్ ద్వారా బోధనలు చేసే జకీర్ నాయక్ ప్రసంగాల స్పూర్తితోనే తుపాకి పట్టాను అని వెల్లడించడంతో వివాదం ప్రారంభ‌మైంది. ఆయ‌న వీడియో పుటేజీలు ప‌రిశీలించ‌గా ఆత్మాహుతి దాడులను ఇస్లాం సమర్థిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలు వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ప‌లు మీడియా సంస్థ‌లు జ‌కీర్‌ పై ప‌లు అంచ‌నాల‌తో చ‌ర్చ‌గోష్టులు నిర్వ‌హించాయి.

ఈ నేప‌థ్యంలో అర్నాబ్ గోస్వామి త‌న‌దైన శైలిలో జ‌కీర్ గురించి విశ్లేషించ‌గా ఆయ‌న కేసు వేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ నాయక్.. ముంబైలోని తన న్యాయవాది ద్వారా అర్నాబ్ కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా అర్న‌బ్ పై జ‌కీర్‌ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. త‌న మీడియా విచారణ జరుపుతున్నారని నోటిసులో పేర్కొన్న జ‌కీర్ త‌మ మత విశ్వాసాలను కించపరుస్తూ, విద్వేషాలనున్ని రెచ్చగొడుతున్నారని అర్న‌బ్ గోస్వామిపై మండిప‌డ్డారు.