Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తెచ్చారు..బాబు ఎత్తేయాలనుకుంటున్నారు

By:  Tupaki Desk   |   23 Oct 2016 9:49 AM GMT
ఎన్టీఆర్ తెచ్చారు..బాబు ఎత్తేయాలనుకుంటున్నారు
X
ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు తెలుగు ప్రజలకు ఇంతగా రాజకీయ చైతన్యం లేదు.. ప్రభుత్వ పాలన కూడా గ్రామస్థాయికి చేరువలో ఉండేది కాదు.. అలాంటిది 1984లో ఎన్టీఆర్ లో మండల వ్యవస్థను ఏర్పాటు చేశాక పరిస్థితులు మారిపోయాయి. అయిదంచెల పంచాయతీరాజ్ వ్యవస్థతో ప్రజలు ఎన్నో ప్రయోజనాలు అందుకున్నారు. అలాంటి అయిదంచెల పంచాయితీరాజ్ వ్యవస్థను మూడంచెలకు కుదించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జడ్పీపీటీసీ - ఎంపీటీసీల వ్యవస్థను రద్దు చేయాలని ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయగా.. తాజాగా చంద్రబాబు కూడా అదే బాట పట్టారు.

ఎంపీటీసీ - జడ్పీటీసీ వ్యవస్థలో ఐదేళ్లకు ఓసారి జరిగే ఎన్నికలతో రాజకీయాలను సామాన్యుల చెంతకు తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్‌ కు దక్కింది. ఆనాడు జిల్లా పరిషత్‌ - మండల పరిషత్‌ అధ్యక్షులను నేరుగా ఎన్నుకునే విధానం అమలులో ఉండేది. మండల పరిషత్‌ అధ్య క్షులు జిల్లా పరిషత్‌ లో సభ్యులుగా వ్యవహ రించడంతో పాటు జడ్పీ వైస్‌ చైర్మన్‌ గా ఎన్నిక కావడంతో పాటు జిల్లా పరిషత్‌ కు సంబం ధించి అంశాలలో ఓటు హక్కు కలిగి ఉండే వారు. అలాగే గ్రామ సర్పంచులు మండల పరిషత్‌లో సభ్యులుగా వ్యవహరించే వారు. అయితే 1994 ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 177 ప్రకారం జిల్లా పరిషత్‌కు సంబంధించి జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఏర్పాటు, 178 ప్రకారం మండల ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీని వల్ల పదవులు పెరగడంతో రాజకీయ పార్టీలకు తమ కార్యకర్తలకు పదవుల పంకానికి కొంత వెసులు బాటు కలిగింది. ఈ ఐదెంచల విధానానికి అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రవేశపెట్టారు. దీనివల్ల రాజకీయ నిరుద్యోగం తీరుతుందని దీనిని కొన్ని రాష్ట్రాలలో అమలు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఐదెంచల పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేశారు. కాగా ఈ వ్యవస్థ రద్దుకు సిఫారసు చేయడంతో అనేక మంది ప్రజాప్రతినిధి హోదాను కోల్పోనున్నారు.

ఈ వ్యవస్థ రద్దయితే ఆంధ్రప్రదేశ్‌ లో ఒకే సారి 10148 ఎంపీటీసీలు - 660 మంది జడ్పీటీసీ సభ్యులు రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేంద్ర ఇచ్చే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. అదే సమయంలో నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నారు. జడ్పీ, మండల పరిషత్‌లకు నిధులు కేటాయించకపోవడంతో జడ్పీటీసీలు - ఎంపీటీసీలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. 14వ ఆర్థిక సంఘం నిధులు జడ్పీ - మండల పరిషత్‌లకు కేటాయించాలని డిమాండ్‌ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడినట్లు స్పష్టమవుతోంది. ఏకంగా ఈ వ్యవస్థనే రద్దు చేయాలని తెలుగు రాష్ట్రాలు సిఫారసు చేయడం చర్చనీయమవుతోంది. ఈపదవులురద్దయితే మండల స్థాయి నేతలను ఎలా సంతృప్తి పరుస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/