Begin typing your search above and press return to search.

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ..వైఎస్ ప్ర‌సంగం వైర‌ల్‌

By:  Tupaki Desk   |   23 Jun 2018 8:13 AM GMT
క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ..వైఎస్ ప్ర‌సంగం వైర‌ల్‌
X
క‌డప ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు విష‌యంలో తెలుగుదేశం ఎంపీ దీక్ష ఆ పార్టీకి బూమ‌రాంగ్ అవుతోందా? తెలుగుదేశం పార్టీ గ‌తం మ‌రిచిపోయి దీక్ష‌లు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మాత్రం ఆ అంశాల‌న్నింటినీ గుర్తుకుచేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలని సీఎం రమేశ్ నిరాహార దీక్ష చేస్తున్న నేప‌థ్యంలో ఇటు సోష‌ల్ మీడియాలో అటు రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా జిల్లాకు పెద్ద దిక్కుగా వ్య‌వ‌హరించిన దివంగత సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌ను ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే..గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్ర‌సంగం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతుంద‌డ‌టం...క‌డ‌ప జిల్లా వాసుల వాట్సాప్‌ లో వైర‌ల్ అవ‌డం.

క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం విష‌యం లోతుల్లోకి వెళితే...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై అప్పటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. 2007 మేలో ఓఎంసి కంపెనీతో అప్పటి వైఎస్ సర్కార్ ఒప్పందం చేసుకొంది. సుమారు 10 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధితో పాటు లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని ప్రతిపాదించారు. 2009 డిసెంబర్ నాటికి తొలిదశ ప్రాజెక్టును రూ.4500 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఒప్పందం మేరకు 2007 జూన్ మాసంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జమ్మలమడుగు నియోజకవర్గంలో సుమారు 10 వేల 670 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఎకరానికి రూ.18,500 చొప్పున విక్రయించారు. అయితే, బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ కోసం అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టిన గాలిజనార్ధన్ రెడ్డి రూ.350 కోట్లు ఆ సమయంలో అప్పుగా తీసుకొన్నాడని వివాదం రేగింది. 2009లోనే తొలి దశ పనులు పూర్తి కావాల్సి ఉండగా కనీసం 5వ వంతు పనులు కూడ పూర్తి కాలేదు. 2009 తర్వాత పనులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీతో చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. 2012 మే 31 ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. అయితే ఈ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన 10,760 ఎకరాల భూమిని మాత్రం 2013 ఏప్రిల్ 25వ తేదిన వెనక్కి తీసుకొంటున్న అప్పటి ప్రభుత్వం జివో జారీ చేసింది.

ఇది బ్రాహ్మ‌ణి ఎపిసోడ్‌ లో చోటుచేసుకున్న ప‌రిణామాలు. అయితే, ఈ ప్లాంట్ విష‌యంలో టీడీపీ చేసిన ర‌చ్చ మామూలుగా లేద‌ని ప‌లువురు అంటున్నారు. క‌డ‌ప‌లో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన ప‌ర్యావ‌ర‌ణ అస‌మ‌తుల్య‌త చోటుచేసుకుంటుంద‌ని, పచ్చదనం హరించుకుపోతుందని తెలుగుదేశం పార్టీ ఆ స‌మ‌యంలో ప్ర‌చారం చేసింది. దీంతో పాటుగా అప్పట్లో శంకుస్థాపన జరిగిన ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపడానికి టీడీపీ అవిశ్రాంతంగా ప్రయత్నించింది. తర్వాతి కాలంలో అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్ల పాటు ఎన్డీఏతో క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంది. అయితే...హ‌ఠాత్తుగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ఆ పార్టీకి ఫ్యాక్ట‌రీ గుర్తుకువ‌చ్చి దీక్ష‌ల ప్ర‌స్తావ‌న తెస్తోంది. ఈ నేప‌థ్యంలోనే... గ‌తంలో టీడీపీ - ఆపార్టీ అనుకూల మీడియా చేసిన ప్ర‌చారాన్ని సీఎంగా ఉన్న వైఎస్ తిప్పికొట్టిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బ్రహ్మణీ స్టిల్స్ కోసం సేకరించిన భూములో సెలయేళ్లు - నదులు పొంగి పొర్లుతున్నాయని, అక్కడ వన్యజీవులున్నాయని ఒక పత్రికలో రాయ‌డం గురించి అసెంబ్లీలో వైఎస్ సభాముఖంగా చదవి వినిపించడం ఆ వీడియో సారాంశం. నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు రాసి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటున్నా వైఎస్ వివరించడం ఆ వీడియోలో క‌నిపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియో టీడీపీ ప్ర‌త్య‌ర్థులు అస్త్రంగా చేసుకొని...ఆ పార్టీ రెండు నాల్క‌ల దోర‌ణిని, ఆ పార్టీ తానా అంటే తందాన అంటున‌న్న మీడియాల తీరును ఎండ‌గ‌ట్టేందుకు వాడుకుంటున్నారు.