Begin typing your search above and press return to search.

ప‌ద్మావ‌తి వివాదం..అదిరిన యోగీ కామెంట్‌

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:55 PM GMT
ప‌ద్మావ‌తి వివాదం..అదిరిన యోగీ కామెంట్‌
X
ప‌ద్మావ‌తి సినిమా విష‌యంలో సాగుతున్న వివాదాల్లో కొత్త అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా అనేది సినీవ‌ర్గాలు - రాజ్‌ పుత్‌ ల మ‌ధ్య బేధాభిప్రాయాల‌కు వేదిక‌గా భావించగా తాజాగా ఇది మ‌రో మ‌లుపు తిరిగిందని అంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ స్పంద‌న‌తో ఈ కొత్త భావ‌న క‌లుగుతోంద‌ని చెప్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ లేటెస్ట్ మూవీ పద్మావతిని బీజేపీ పాలిత రాష్ట్రమైన‌ మధ్యప్రదేశ్ ఇప్పటికే నిషేధించిన సంగ‌తి తెలిసిందే. మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఆ చిత్రాన్ని తప్పుబట్టింది. సాక్షాత్తు సీఎం ఆ సినిమాను త‌ప్పుప‌ట్ట‌డంతో...ఈ సినిమాకు వ్య‌తిరేకంగా సాగుతున్న ప్ర‌చారాన్ని బీజేపీ త‌ల‌కెత్తుకుంద‌ని అంటున్నారు.

తాజాగా యోగీ ఆదిత్య‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ భన్సాలీ తల తెస్తే బహుమతి ఇస్తామని ప్రకటిస్తున్నవారు చేస్తున్నది తప్పయితే భన్సాలీ చేసింది కూడా తప్పేనని అన్నారు. `యూపీలో ఉన్న 22 కోట్ల మంది సెంటిమెంట్లను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సినిమాపై మా అభ్యంతరాలను చెబుతూ ఇప్పటికే మేము కేంద్రానికి లేఖ కూడా రాశాం. భన్సాలీ తలపై బహుమతి ప్రకటించడం తప్పయితే.. భన్సాలీ చేసింది కూడా తప్పే` అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ప‌ష్టం చేశారు.

అయితే దీనిపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ స్పందిస్తూ.. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పద్మావతి వివాదాన్ని రేపుతున్నదని ఆరోపించింది. చరిత్రను తప్పుగా చూపించడాన్ని తాము కూడా సహించబోమని, అయితే ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకొని యోగి ప్రభుత్వం తమ వైపల్యాలను కప్పిపుచ్చుకుంటోంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ``సీఎం గారు22 కోట్ల యూపీ ప్రజలు అంటున్నారు. నిజానికి వాళ్లంతా ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారా? బీజేపీ తమ హామీలను నెరవేర్చాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు నిరుద్యోగం, రవాణా, విద్యుత్, శాంతిభద్రతలపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు`` అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అన్నారు. కానీ ఈ విష‌యాలు ప‌క్క‌న‌పెట్టి విమ‌ర్వ‌ళు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.