Begin typing your search above and press return to search.

యోగీ ప‌గ తీర్చుకుంటే...ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   24 March 2018 4:21 AM GMT
యోగీ ప‌గ తీర్చుకుంటే...ఇలా ఉంటుంది
X
ఇటీవ‌ల ఉత్తరప్రదేశ్‌ లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ కు ఘోర ప‌రాభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం గోర‌ఖ్‌ పూర్‌ లో బీజేపీ అభ్య‌ర్థి ఓట‌మి పాల‌య్యారు. దీంతో యోగి హ‌వా ఏమీ లేద‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. అయితే త‌ను ప్ర‌త్య‌ర్థిని ల‌క్ష్యంగా చేసుకుంటే..ఎలా ఉంటుందో రాజ్యసభ ఎన్నికల సంద‌ర్భంగా నిరూపించారు. తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ 9వ అభ్యర్థిని రంగంలో నిలిపిన బీజేపీ అతడినీ గెలిపించుకోగలిగింది. సమాజ్‌వాదీ పార్టీ మద్దతిచ్చినప్పటికీ, క్రాస్ ఓటింగ్ కారణంగా బీఎస్పీ అభ్యర్థి భీమ్‌ రావ్ అంబేద్కర్ ఓటమిపాలయ్యారు.

ఉత్తర్‌ ప్రదేశ్ ఉపఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఆ పరాభవానికి ప్రతీకారంగా రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించింది. బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ఎస్పీ-బీఎస్పీ కూటమిపై దెబ్బకొట్టింది. 8మంది గెలుపొందే అవకాశమున్నప్పటికీ - 9వ అభ్యర్థినీ రంగంలోకి దింపి గెలిపించుకోగలిగింది. ఇక సమాజ్‌ వాదీ పార్టీ తన ఏకైక అభ్యర్థి గెలిపించుకోగలిగినా - క్రాస్ ఓటింగ్‌ తో బీఎస్పీ అధినేత్రి మాయావతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించేలా సాగిన యూపీ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పది స్థానాలకు 11మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 47మంది ఎమ్మెల్యేలున్న ఎస్పీ తన అభ్యర్థి జయాబచ్చన్‌ ను సునాయాసంగా గెలిపించుకోగలిగింది. మిగిలిన పది ఓట్లను బీఎస్పీ అభ్యర్థికి వేయాలని నిర్ణయించినప్పటికీ క్రాస్ ఓటింగ్ దెబ్బకొట్టింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటేసినట్లు బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్ ప్రకటించారు. తగిన సంఖ్యాబలం లేకపోయినా స్వతంత్రులపై ఆశతో 9వ అభ్యర్థిని బరిలోకి దింపిన బీజేపీకి అనిల్‌ సింగ్ ఓటు కీలకమైంది. మరోవైపు బీఎస్పీతో బద్దవిరోధిగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యేలు రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యా - వినోద్ సరోజ్ ఎస్పీ అభ్యర్థి జయాబచ్చన్‌ కు ఓటేసినట్లు తెలుస్తోంది.

కాగా, కీలకమైన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. ఏడు రాష్ర్టాల్లోని 25 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరుగగా 12చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 59 సీట్లకుగాను ఇప్పటికే 10 రాష్ర్టాల్లోని 33 మంది అభ్యర్థులు ఈ నెల 15న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 16మంది బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. తాజాగా గెలుపొందిన సీట్లతో కలిపితే బీజేపీ నుంచి మొత్తం 28మంది రాజ్యసభకు ఎన్నికయ్యారు.