Begin typing your search above and press return to search.

కోర్టులో ఏడ్చేసిన మాజీ ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   3 May 2016 9:50 AM GMT
కోర్టులో ఏడ్చేసిన మాజీ ముఖ్యమంత్రి
X
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని ఏలేసిన బీజేపీ సీనియర్ నేత.. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పకు చెందిన ఉదంతం ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. పలు అవినీతి ఆరోపణలున్న యడ్యూరప్ప కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన ఆయనకు ఊహించని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. గనుల స్కాంకు సంబంధించిన కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన.. కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రెండున్నర గంటల వ్యవధిలో 475 ప్రశ్నలు ఎదురుకావటంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురి అయినట్లుగా చెబుతున్నారు. సీబీఐ కోర్టులో వేసిన వరుస ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన యడ్యూరప్ప ఒక దశలో భోరున విలపించినట్లుగా తెలుస్తోంది. తనను ఇంతగా ఇబ్బంది పెట్టొద్దంటూ వాపోయినట్లుగా చెబుతున్నారు.

గనుల స్కాంలో రూ.20కోట్లను ఆయన కటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రేరణా ట్రస్ట్ కు అందుకున్న అంశంపై పలు ప్రశ్నల్ని ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. మీ మీద వచ్చిన ఆరోపణలకు మీరేమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు.. తీవ్ర భావోద్వేగానికి గురైన యడ్యూరప్ప తాను తప్పు చేయలేదని.. చట్టబద్ధమైన పాలన చేపట్టినట్లుగా చెప్పారంటున్నారు. తాను తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసినట్లుగా సమాచారం.

మైనింగ్ స్కాంలో భాగంగా ప్రేరణా ట్రస్ట్ కు ముడుపుల రూపంలో భారీగా నిధులు వచ్చినట్లుగా అక్రమ గనుల వ్యవహారంపై విచారించిన లోకాయుక్త యడ్యూరప్పపై ఆరోపణలతో నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించిన కేసు విచారణ ఇప్పుడు సీబీఐ కోర్టులో నడుస్తోంది. ఏమైనా.. యడ్యూరప్ప ఉదంతం రాజకీయ నాయకులకు ఒక గుణపాఠంగా చెప్పాలి. ఉన్నత స్థానాల్లో ఉండే వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే.. పదవి పోయినా.. చేసిన తప్పులు తమను వెంటాడుతాయన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.