Begin typing your search above and press return to search.

ఎలుక దెబ్బ‌కు వెన‌క్కు వెళ్లిన యడ్యూరప్ప!

By:  Tupaki Desk   |   15 Oct 2019 6:27 AM GMT
ఎలుక దెబ్బ‌కు వెన‌క్కు వెళ్లిన యడ్యూరప్ప!
X
ఒకే ఒక ఎలుక రాష్ట్ర ముఖ్యమంత్రిని వెనక్కి పంపింది. వినటానికి కాస్త విచిత్రంగా ఉందనుకున్నా ఇది నిజం. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బెంగళూరు విధాన సౌధలోని శక్తి కేంద్రంలో నిత్యం అధికారులతో సమీక్షలు - సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా ఆయన వివిధ కమిటీలతో సమావేశాలు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు ఈ షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10.30 గంట‌ల‌కు విధాన సౌధ‌లోని శ‌క్తికేంద్రంలో ఉన్న సమావేశపు హాలు లోకి వచ్చారు.

అయితే ఆ సమావేశపు హాలులో ఓ ఎలుక‌ చనిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళ నాసికా రంధ్రాలు పగిలిపోయేలా దుర్వాసన వెదజల్లుతోంది. అక్కడి నుంచి బ‌య‌ట ప‌డ‌దామా ? అంటే ముఖ్యమంత్రి సమీక్ష కు వస్తున్నారు.. చివరకు వాళ్ళంతా ఆ కంపు భరిస్తూ అక్కడే గడిపారు. ముఖ్యమంత్రి సమావేశపు హాలులోకి ప్రవేశించే సరికి కంపు తీవ్రం కావడంతో వాళ్లంతా తట్టుకోలేకపోయారు. చివరకు ముఖ్య‌మంత్రి సైతం ఆ కంపు భరించలేకపోయారు.

ఆ కంపు భ‌రించ‌లేని ఆయ‌న ఒక్క‌సారిగా 313 గది పర్యవేక్షకులు - సంబంధిత అధికారులపై  విరుచుకుపడ్డారు. అస‌లు మీరేం చేస్తున్నారు ? ఇలా ఉంటే ఇక్క‌డ ఎలా కూర్చోవాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌క్క‌నే ఉన్న‌వాళ్లు ఆయ‌న‌కు స‌ర్ది చెప్పేందుకు ప్ర‌య‌త్నించినా ఆయ‌న మాత్రం మ‌రో మాట మాట్లాడితే బాగుండ‌దంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఆ గ‌దిని వెంట‌నే శుభ్రం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసి... చివ‌ర‌కు సీఎం పేషీకు చేరుకుని అక్కడ నుంచే స‌మీక్ష కొన‌సాగించారు. ట్విస్ట్ ఏంటంటే బెంగ‌ళూరు విధాన సౌధ‌లో ఎలుక‌ల బెడ‌ద ఎక్కువ‌. ప్ర‌తి యేటా వీటిని నియంత్రించేందుకు పెద్ద ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తుంటారు. ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నా ఈ ఎలుక‌ల బెడ‌ద‌ను మాత్రం నియంత్రించ‌లేక‌పోతున్నారు.