Begin typing your search above and press return to search.

‘యాత్ర’ సక్సస్ తో నేరుగా వైఎస్ ఆర్ ఎంటరయ్యారా?

By:  Tupaki Desk   |   11 Feb 2019 7:28 AM GMT
‘యాత్ర’ సక్సస్ తో నేరుగా వైఎస్ ఆర్ ఎంటరయ్యారా?
X
వైఎస్ ఆర్ బయోపిక్ గా వచ్చిన చిత్రం ‘యాత్ర’ భారీ ఘనవిజయం దిశగా దూసుకెళుతుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు - సీని నటుడు నందమూరి తారాక రావురావుపై తీసిన బయోపిక్ కథానాయకుడి కంటే ‘యాత్ర’ సినిమా విజయవంతం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ లో స్వయంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషించిన సంగతి తెల్సిందే. అయినా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో తెలుగులో అంతగా మార్కెట్ లేని మళయాల సూపర్ స్టార్ మమ్మూట్టి రాజశేఖర్ పాత్రలో మెప్పించి ఈ చిత్ర విజయానికి తనవంతు సహకారాన్ని అందజేశారు. ఈ చిత్రం సక్సస్ ప్రస్తుతం టీడీపీకి తలనొప్పిగా మారింది.

ప్రస్తుతం చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలన్నీంటికి ఆద్యుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డే. నేడు భారీగా పెన్షన్లు ఇస్తున్న అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చింది రూ.75 మాత్రమే. ఆయన హయాంలో ఊరికి ఐదారుగురిని ఎంపిక చేసి ఇచ్చేవారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజితమే. రాజశేఖర్ రెడ్డి మొదటిసారి అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితిని మార్చివేశారు. వృద్ధులు - వింతతువులు - వికలాంగులకు పెన్షన్లు - ఇందిరమ్మ ఇళ్లు - అడిగిన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు. ఆరోగ్య శ్రీ - 108 వంటి పలు ప్రజాదరణ పథకాలు అమలు చేసి రెండోసారి అధికారంలోకి వచ్చారు.

ఇక 2014లో అనేక సమీకరణాల మధ్య అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ పథకాలనే కాపీ కొడుతూ వచ్చారు. వైఎస్ పథకాల పేర్లను మార్చి ఎన్టీఆర్ - తన పేరిట పేర్లను పెట్టుకున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీని ఎన్టీఆర్ వైద్యశ్రీ - ఇందిరమ్మ గృహ కల్పనకు మరోమారు ఇలా పథకాల పేర్లను మార్చి కొనసాగిస్తూ వస్తున్నారు. ఒక్క 108కు మాత్రం పేరును మార్చలేకపోయారు.

నేడు చిత్తూరుకు నీళ్లిచ్చాం అంటూ చంద్రబాబు డప్పులు కొట్టుకుంటున్నారు. కానీ ఆనాడే వైఎస్ ఆర్ హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వాటర్ సోర్స్ ఆధారంగానే ప్రస్తుతం కియా పరిశ్రమ చిత్తూరుకు తరలివచ్చింది. వైఎస్ ఆర్ చొరవ లేకపోతే చిత్తూరుకు పరిశ్రమలు వచ్చేవి కాదనడంలో సందేహం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే యాత్ర సినిమాలో వైఎస్ ఆర్ మానపుత్రికలుగా చెప్పుకొనే ఆరోగ్యశ్రీ - ఫీజురీయంబర్స్ మెంట్ - 108 వంటి పథకాల ఆలోచనలు ఎలా వచ్చాయనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ కంటే ‘యాత్ర’ సక్సస్ కావడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన మద్దతు వైఎస్ ఆర్ నేరుగా తెలిపారని పలువురు చర్చించుకుంటున్నారు. యాత్ర సక్సస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత ఉత్సాహంగా ఎన్నికల బరిలో విజృంభించడం ఖాయంగా కనిపిస్తుంది.