Begin typing your search above and press return to search.

మోడీపై అలిగి పార్టీకి సీనియ‌ర్ గుడ్ బై!

By:  Tupaki Desk   |   21 April 2018 1:54 PM GMT
మోడీపై అలిగి పార్టీకి సీనియ‌ర్ గుడ్ బై!
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇర‌కాటంలో ప‌డే సంద‌ర్భం ఎదురైంది. సాక్షాత్తు పార్టీ నేత‌ల ద్వారా ఆయ‌న అనుమానపు చూపుల ఎదుర్కునే ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...కేంద్ర మాజీ మంత్రి - బీజేపీ సినియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

బీహార్ రాజ‌ధాని పాట్నాలో జరిగిన రాష్ట్ర మంచ్ స‌మావేశంలో సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు, లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ నాయ‌కులు - బీజేపీ సీనియర్ నేత - ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా ఇందులో పాల్గొన్నారు. `ఈ రోజు బీజేపీతో ఉన్న అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నాను. పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటా. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా` అని ఆయన అనూహ్య‌ ప్రకటన చేశారు. పార్టీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీజేపీ నుంచి తప్పుకుంటున్నా. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలను మీరంతా చూశారు. చరిత్రలోనే అతి తక్కువ సమయం మాత్రమే సభ సజావుగా జరిగిందని తెలిపారు. సిన్హా 1998 నుంచి 2004 మధ్య మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్‌ పేయి కేబినెట్‌ లో ఆర్థిక మంత్రిగా - విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.