Begin typing your search above and press return to search.

యాకూబ్ పోస్టమార్టం తర్వాతేం జరిగింది..?

By:  Tupaki Desk   |   31 July 2015 5:06 AM GMT
యాకూబ్ పోస్టమార్టం తర్వాతేం జరిగింది..?
X
ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషి గా నిరూపితమైన యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు ముందు నుంచి.. ఉరిశిక్ష అమలు చేసినంతవరకూ ప్రసార సాధనాలు ఉదరగొట్టటం తెలిసిందే. ఆ తర్వాత సంఘటనల మీద మాత్రం పెద్దగా వార్తలు రాలేదు.

దీనికి కారణం.. ఒకటి చట్టబద్ధమైన హెచ్చరిక చేయటం.. యాకూబ్ మెమన్ అంతిమయాత్రను ప్రసారం చేయకూడదని.. ఫోటోలు ప్రచురించకూడదని ప్రభుత్వం ఆదేశించటంతో దీనికి సంబంధించి వార్తల్ని.. లైవ్ లో పెద్దగా అప్ డేట్ చేయలేదు. ఇక.. ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత.. వైద్యులు పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించారు. అనంతరం ఏం జరిగిందంటే..

నాగపూర్ నుంచి యాకూబ్ మెమన్ మృతదేహాన్ని తీసుకొన్న ఆయన కుటుంబ సభ్యులు ముంబయికి బయలుదేరారు. మహీమ్ లోని ఆయన ఇంట్లో రెండు గంటల పాటు ఆయన మృతదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబీకులు.. బంధువులు అయన్ను చూసుకున్నారు. అనంతరం ప్రార్థనలు చేశారు.

మృతదేహాన్ని ఖననం చేసేందుకు మెరైన్ లైన్స్ లోని శ్మశాన వాటికకు పార్థిపదేహాన్ని తీసుకొచ్చారు. అంతిమయాత్ర చేయాలన్న ఆలోచనకు పోలీసుల అనుమతి లభించలేదు. శాంతిభద్రతల సమస్య చోటు చేసుకునే అవకాశం ఉందన్న ఉద్దేశ్యంతో అనుమతిని నిరాకరించారు. ఇక.. మీడియా చిత్రీకరణను కూడా నిషేధించారు. ఇంటి నుంచి శశ్మాన వాటిక మధ్య మొత్తం రహదారిని పోలీసులతో నింపేశారు. ఇందుకోసం 30వేల మంది పోలీసు బలగాల్ని మొహరించారు.

శశ్మానవాటికలో మృతదేహాన్ని ఖననం చేసే సమయానికి ముంబయిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అంత్యక్రియల్ని పూర్తి చేశారు. దీనికి ముందు.. ముంబయిలో నేర చరిత కలిగిన 526 మందిని బుధవారమే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. 22 ఏళ్ల కిందట 257 మంది అమాయకుల మరణాలకు కారణమైన వ్యక్తి మృతదేహానికి ఖననం చేసే సమయంలో 30వేల మంది పోలీసులు భద్రత కల్పించేందుకు అవసరమైతే.. అతన్ని చూసేందుకు వందలాదిగా ప్రజలు రావటం దేనికి నిదర్శనం..?