Begin typing your search above and press return to search.

ఇక చంద్ర‌బాబుకు చుక్క‌లే!

By:  Tupaki Desk   |   20 July 2017 10:51 AM GMT
ఇక చంద్ర‌బాబుకు చుక్క‌లే!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి ఇక‌పై అంతా ముళ్ల బాట‌లానే ప‌రిణ‌మించేలా ఉంది. ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబుపై కేంద్రానికి పెద్ద‌గా ఫిర్యాదులు వెళ్లిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. చంద్రబాబుకు ఆప‌ద్భాంద‌వుడిగా ఉన్న కేంద్ర మంత్రి ప‌ద‌వికి ఇటీవ‌లే రాజీనామా చేసిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ఎప్పుడైతే.. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారో... అప్ప‌టి నుంచి ఫిర్యాదులు మొద‌ల‌య్యాయి. అటు కేంద్రంలోనే కాకుండా ఇటు న‌వ్యాంధ్ర‌లోనూ చంద్రబాబు ఆధ్వ‌ర్యంలోని టీడీపీ - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్ర‌ప‌క్షాలుగా ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారును బీజేపీ ర‌న్ చేస్తుంటే... ఇక్క‌డ బీజేపీని మిత్ర‌ప‌క్షంగా చేసుకుని చంద్ర‌బాబు పాల‌న సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న పార్టీకి చెందిన అధినేత‌పై ఫిర్యాదుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అంత పెద్ద‌గా ప‌ట్టించుకోద‌న్న భావ‌న‌తో మొన్న‌టిదాకా చంద్ర‌బాబుపై ఫిర్యాదులు వెళ్ల‌లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

అయితే వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి... రాజ‌కీయంగా అస్త్ర‌స‌న్యాసం చేయ‌డం, మ‌రోవైపు ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రామ్‌ నాథ్ కోవింద్‌ కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం ద్వారా బీజేపీతో కాస్తంత స‌న్నిహిత‌త్వం ఏర్ప‌డ్డ నేప‌థ్యంలో వైసీపీ... చంద్ర‌బాబు సాగిస్తున్న అరాచ‌కాల‌పై ఫిర్యాదుల‌ను వెల్లువెత్తిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొన్న‌టికి మొన్న క‌ర్నూలు జిల్లా నంద్యాల బైపోల్స్‌లో ఎలాగైనా విజ‌యం సాధించేందుకు చంద్ర‌బాబు చేస్తున్న య‌త్నాల‌ను త‌ప్పుబ‌డుతూ... ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు చంద్ర‌బాబు య‌త్నిస్తున్నార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ఆయ‌న పార్టీని ర‌ద్దు చేయాల‌ని వైసీపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌నర్ ఏకే జోతి... విష‌యంపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హామీ కూడా ఇచ్చారు.

తాజాగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కాసేప‌టి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. త‌న సొంత జిల్లా ప్రకాశంలోని దేవరపల్లి గ్రామానికి చెందిన‌ దళితుల భూముల్లో ప్రభుత్వం అక్రమాలపై ఆయన ఈ సందర్భంగా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అనంతరం జాతీయ ఎస్సీ క‌మిష‌న్ కు వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి ఆ కమిషన్‌ చైర్మన్‌ కఠారియాను కలిశారు. దేవరపల్లిలోని దళితులు సాగు చేసుకుంటున్న భూములపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎస్సీ కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దళితుల భూములకు రక్షణ కల్పించి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని కఠారియాకు విజ్ఞప్తి చేశారు. దళితులు - గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా భూములు లాక్కోవడం అన్యాయమని, వందల సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి, దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్ర‌బాబుపై ఫిర్యాదు చేశారు. తక్షణమే దళితుల భూములకు రక్షణ కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. మ‌రి ఈ ఫిర్యాదుల‌పై అటు హోం మంత్రి గానీ, ఇటు జాతీయ ఎస్సీ క‌మిష‌న్ గానీ ఎలా స్పందిస్తాయ‌న్న అంశం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.