Begin typing your search above and press return to search.

ఈ ఎంపీ సీటు.. వైసీపీలో టెన్షన్‌.. టెన్షన్‌.. !

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:39 AM GMT
ఈ ఎంపీ సీటు.. వైసీపీలో టెన్షన్‌.. టెన్షన్‌.. !
X
ఏపీ పొలిటికల్‌ జంపింగ్‌ జపాంగ్‌ కార్యక్రమంలో వైసీపీ నేతలను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు.. బీజేపీలోని నాయకులు కూడా వైసీపీ గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారట. ఏపీ బీజేపీ సీనియర్‌ నాయకుల్లో ఒకరైన కావూరి సాంబశివరావు త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఏపీలో ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునేందుకు కష్టపడుతున్న బీజేపీకి కావూరి వలస వార్తతో షాక్‌ ఇచ్చినట్లయింది.

కాంగ్రెస్‌ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగిన కావూరి సాంబశివరావు యూపీఏ-2 హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్‌ ను వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చేరినప్పటి నుంచి కావూరి పొలిటికల్‌ గా యాక్టివ్‌ గా కనిపించలేదు. సీనియర్‌ నేతగా తన ఉనికిని పెద్దగా చాటుకోని కావూరి తన రాజకీయ భవిష్యత్తుపై సీరియస్‌ గా ఆలోచన చేస్తున్నారట.

ఏపీలో టీడీపీతో పొత్తు చెడిన తరువాత బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో ఆ పార్టీలో కొనసాగితే వచ్చేదేముందని కావూరి భావిస్తున్నట్లు సమాచారం.. దీంతో ఆయన వైసీపీలోకి చేరడం ఖాయమంటున్నారు. అయితే కావూరితో చర్చించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నా కావూరి అందుబాటులో ఉండడం లేదట. ఆయనకు ఫోన్‌ చేసిన ప్రతిసారీ పోన్‌ కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి బలమైన నాయకులు లేరు. ఈ సమయంలో కావూరి వైసీపీలో చేరితే పార్టీకి సీనియర్‌ నేత ఉండడంతో పాటు, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత ఉన్నట్లుంటుందని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అంతేకాకుండా ఏలూరు నుంచి ఆయన కాంగ్రెస్‌ లో చక్రం తిప్పారు. దీంతో వైసీపీలోకి చేరితే కావూరికి ఏలూరు ఎంపీ టిక్కెట్‌ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా ఏలూరు నుంచి తాను వైసీపీ అభ్యర్థిని అన్నట్లుగా కోటగిరి శ్రీధర్‌ రావు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కోటగిరి విద్యాధర్‌ రావు కమారుడైన శ్రీధర్‌ ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌ చార్జిగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో కావూరికి ఎంపీ టికెట్‌ కేటాయిస్తే శ్రీధర్‌ కేంద్రంగా అసమ్మతి చెలరేగడం ఖాయమంటున్నారు. ఒకవేళ జగన్‌ కావూరికి మద్దతు పలకమని శ్రీధర్‌ ను కోరినా ఆయన ఏమాత్రం సిద్ధంగా లేరని సన్నిహితులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో కావూరి,శ్రీధర్‌ లిద్దరిని జగన్‌ ఎలా ఒప్పిస్తారోనన్న టెన్షన్‌ వైసీపీలో మొదలైంది.