Begin typing your search above and press return to search.

సీమను ఈసారి ఫ్యాన్ ఊడ్చేస్తోందా?

By:  Tupaki Desk   |   12 April 2019 10:01 AM GMT
సీమను ఈసారి ఫ్యాన్ ఊడ్చేస్తోందా?
X
నిన్న జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే ఏపీలోని రాయలసీమలో ఏకపక్ష పోలింగ్ జరిగిందనే చెప్పవచ్చు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో గత ఎన్నికల్లో టీడీపీ స్థానాలను గెలుచుకుంది. అత్యధిక స్థానాలను మాత్రం వైసీపీ సొంతం చేసుకుంది. టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరులోనూ అనుకున్న సీట్లను తెలుగుదేశం రాబట్టలేకపోవడంతో ఈసారి మెజార్టీ సీట్లపై టీడీపీ అధినేత కన్నేశారు. అయితే అనూహ్యంగా ఈసారి ఎన్నికల్లో వైసీపీ రాయలసీమ ప్రాంతాన్ని క్లీన్‌ స్వీప్‌ చేసినట్టే కనిపిస్తోంది.. కోస్తా ఆంధ్రలో ఆ పార్టీని ఆదరించలేకపోయినా రాయలసీమలో మాత్రం తమకే పట్టం కడుతారని వైసీపీ భావిస్తోంది. అయితే అభివృద్ధి పథకాలతో పోరుగడ్డ తమవైపే ఉందని టీడీపీ భావిస్తోంది. ఆయా జిల్లాలా వారీగా ఒకసారి పరిశీలిద్దాం.

చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో గత ఎన్నికల్లో 8 స్థానాలు వైసీపీ గెలుచుకోగా 6 స్థానాలను టీడీపీ సొంతం చేసుకుంది. నగరి - పుంగనూరు - పీలేరు - చిత్తూరు నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య పోటీ టఫ్‌ గా ఉందని సమాచారం. అభ్యర్థులు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టతరంగా మారింది. ప్రతీసారి సొంత జిల్లా అయిన చిత్తూరు చంద్రబాబుకు కలిసి రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా కొన్ని సీట్లయినా ఇతర పార్టీలకు వెళ్తున్నాయి. అయితే తను ఐదేళ్లలో చేసిన అభివృద్ధి - సంక్షేమ పథకాలు గెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లా వైసీపీకే సొంతం అన్నట్లుగా గత పోరు సాగుతోంది. గత ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్‌ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువ సీట్లు సాధించడానికి చంద్రబాబు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకొని బరిలో నిలిపినా వారి ప్రభావం అంతగా లేనట్లేనని తెలుస్తోంది. నిన్నటి పోలింగ్‌ సరళిని చూస్తే కోట్ల ఫ్యామిలీని ఆదరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైసీపీకి కంచుకోటగా ఉన్న కడపలో మరోసారి ఫ్యాన్‌ గాలే వీయనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 10 స్థానాల్లో 9 సీట్లను కైవనం చేసుకున్న వైసీపీ ఈసారి కూడా అంతేస్థాయిలో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక జమ్మలమడుగులో మాత్రం అటు ఇటుగా ఉన్నట్లు పోరు సాగింది. పోలింగ్‌ సైతం అక్కడ మందకొడిగా సాగడంతో ఆ ఒక్క సీటు మినహా కడప మొత్తం వైసీపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది.

అనంతపురం సంగతి అందరికీ తెలిసిందే. ఈ జిల్లా టీడీపీకి కంచుకోటగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం తన ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు బరిలో ఉంచిన అభ్యర్థులపై వస్తున్న వ్యతిరేకతే ఇందుకు కారణమని సమాచారం. జేసీ - పరిటాల ఫ్యామిలీల ఫాక్షనిజంతో ప్రజలు వైసీపీకి పట్టం కట్టనున్నారా..? అన్న చర్చ సాగుతోంది.

మొత్తం మీద ఓవరాల్‌ గా చూస్తే వైసీపీ ఈసారి రాయలసీమలో ఎక్కువ స్థానాలను గెలుచుకొని ప్రభంజనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. కోస్తాంధ్రలో కూడా ఇదే ఊపు ఉంటే అధికారం దిశగా వెళ్లే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.