Begin typing your search above and press return to search.

టీడీపీ లో ఆయన గెలుస్తున్నారట...వైసీపీ శిబిరాల్లో సంబరాలు

By:  Tupaki Desk   |   19 April 2019 1:31 PM GMT
టీడీపీ లో ఆయన గెలుస్తున్నారట...వైసీపీ శిబిరాల్లో సంబరాలు
X
రాజకీయాల్లో వ్యూహాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో సెంటిమెంట్లకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. రాజకీయ నాయకులు ప్రచారం మొదలు పెట్టడం నుంచి సభలు నిర్వహించడం వరకు ఎక్కడకు వెళ్లాలి, ఎక్కడకు వెళ్లకూడదన్న విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. ప్రతినేతా ఏదో ఒక సెంటిమెంటు కలిగి ఉంటారు. చివరకు వామపక్ష నేతలకూ సెంటిమెంట్లు ఉన్నాయని చెబుతుంటారు. అలాగే పార్టీలకూ కొన్ని సెంటిమెంట్లు ఉంటుంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే పార్టీ ఆ రాష్ట్రంలో పరాజయం పొందడం.. పార్టీ నేతల్లో కొందరి గెలుపు పార్టీ అధికారం కోల్పోవడానికి సూచికగా మారడం వంటి సెంటిమెంట్లు ఉంటుంటాయి. అలాంటివాటిలో ఒకటి టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ గెలుపు ఒకటి.. ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు.. ఆయన ఓడిపోతే పార్టీ అధికారంలోకి వస్తుందన్నది సెంటిమెంటు.

ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ మాంచి కాన్ఫిడెన్సుతో ఉండగా టీడీపీ నేతలు కూడా తాము మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే.. పోలింగ్ తరువాత ఐవీఆర్ విధానం ద్వారా టీడీపీ సర్వే చేస్తున్నట్లుగా సమాచారం. ఆ సర్వే ప్రకారం పయ్యావుల కేశవ్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నారని తెలిసిందట. ఆ సంగతి తెలియగానే పార్టీ నేతలంతా ఒక్కసారిగా షాకైనట్లు తెలుస్తోంది. పయ్యావుల గెలిస్తే ఇక పార్టీ అధికారంలోకి రానట్లేనని టీడీపీలో చర్చించుకుంటున్నారట.

పయ్యావుల అనంత‌పురం జిల్లా లోని ఉర‌వ‌కొండ నుండి టిడిపి అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ప‌య్య‌వుల కేశ‌వ్ కుటుంబం తొలి నుండి రాజ‌కీయాల్లో ఉంది. అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌య్యావుల కేశ‌వ్ టిడిపి అధినేత చంద్ర‌బాబుకు విధేయుడు. కేశ‌వ్ తండ్రి వెంక‌ట నారాయ‌ణ ఇదే జిల్లా రాయ‌దుర్గం నుండి ఒక‌సారి ఎమ్మెల్యే గా గెలిచారు. ప‌య్యావుల కేశ‌వ్ ఉర‌వ‌కొండ నుండి మూడు సార్లు గెల‌వ‌గా..రెండు సార్లు ఓడిపోయారు. ఇక‌, 2014 ఎన్నిక ల్లో కేశ‌వ్ ఓడినా ..టిడిపి అధికారంలోకి వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో కేశ‌వ్ పైన పోటీ చేసిన వైసిపి అభ్య‌ర్ది విశ్వేశ్వ‌రరెడ్డి 2275 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టిడిపి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టిడిపి అధినేత చంద్ర‌బాబు కేశ‌వ్‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించి..శాస‌న మండ‌లిలో చీఫ్ విప్‌గా నియ‌మించారు. రాజ‌కీయంగా వాగ్దాటి ఉన్న కేశ‌వ్ కు మంత్రి అవ్వాల‌నేది చిర‌కాల కోరిక‌. అయితే, ఆయ‌న గెలిచినప్పుడు పార్టీ గెలవడం లేదు.

ప్రస్తుత ఎన్నికల్లో వైసిపి నుండి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వ‌ర రెడ్డిని బ‌రిలో ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య హోరా హోరీ పోరు సాగింది. ఈ ఎన్నిక‌ల్లో టిడిపి నేత‌లు ఉర‌వ‌కొండ నుండి ఖ‌చ్చితంగా కేశ‌వ్ గెలుస్తార‌నే ధీమాతో ఉన్నారు. దీంతో పార్టీ నేతలంతా కంగారుపడుతున్నారట. ఇక్కడ ఒక్క పయ్యావులే కాదు.. ఉరవకొండలో ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రావడంలేదు. 1999 లో కాంగ్రెస్ అభ్య‌ర్ది శివ‌రామిరెడ్డి గెలిచారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. 2004,2009 లో కేశ‌వ్ గెలుపొందారు. రెండు సార్లు టిడిపి అధికారంలో లేదు. 2014 లో వైసిపి అభ్య‌ర్ది విశ్వేశ్వ‌ర రెడ్డి గెలిచారు. వైసిపి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మైంది. దీంతో ఈసారి పయ్యావుల ఇక్కడ నుంచి గెలుస్తారని అంచనాలు ఉండడంతో ఆ పార్టీ నేతలకు భయం పట్టుకోగా.. వైసీపీ నేతల్లో ఆనందం పొంగిపొర్లుతోందట.