Begin typing your search above and press return to search.

అన్ని కులాలను మోసం చేసింది బాబు ఒక్కడే..

By:  Tupaki Desk   |   21 Jun 2018 11:10 AM GMT
అన్ని కులాలను మోసం చేసింది బాబు ఒక్కడే..
X
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రోజురోజుకు రాటుదేలుతున్నారు. తన మాటల తూటాలకు పదును పెడుతున్నారు. మహాసంకల్ప యాత్రలో భాగంగా చంద్రబాబు పై జగన్ చేస్తున్న విమర్శలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రస్తుతం రాజోలులో పాదయాత్ర చేస్తున్న అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ఎండగట్టారు.

వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయనేసరికి 2019లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తానంటున్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 రాష్ట్రాన్ని చేస్తానంటున్నారు. అసలు నాకు తెలియక అడుగుతున్నా.. 70 ఏళ్ల బాబుకు 2050తో పనేంటి .? ఇన్నేళ్లు చూశాం. 110 సంవత్సరాలు వచ్చినా బాబును చూస్తూనే ఉండాలా.?’ అని సెటైర్ వేశారు.

‘ఈ నాలుగేళ్లలో అవినీతి, మోసం, దోపిడీ పాలన , అరాచకం, అబద్ధాలు లాంటి 5 స్కీములను చంద్రబాబు అమలు చేశారు. రుణమాఫీ ని కూడా మోసం అనే స్కీము కింద కలిపేశారని ’ జగన్ విమర్శించారు. చంద్రబాబు పాలన తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు.

‘‘బాబు పాలనలో రుణాల మాట దేవుడెరుగు.. కనీసం వ్యవసాయం కూడా మాఫీ అయిపోయిందని జగన్ విమర్శించారు. 87612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని .. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని ఇంటికి తెస్తానని ముఖ్యమంతి అయ్యారు. నాలుగేళ్లలో బంగారం ఇంటికి రాలేదు సరికదా.. బ్యాంకులు పంపిస్తున్న వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయని’’ జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలు నిలదీస్తారని 2014లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను కూడా అన్ని వెబ్ సైట్స్ నుంచి బాబు తొలగించారని జగన్ వివరించారు.

మేనిఫెస్టోలో కాపులను బీసీల్లోకి మార్చుతామని బాబు అన్నారని.. ఇప్పుడు అడిగితే కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నాడని జగన్ విమర్శించారు. చంద్రబాబు కాపులనే కాదు.. బోయల్ని - మత్య్సకారుల్ని - నాయి బ్రాహ్మణులను ఇలాగే మోసం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో మోసపోని కులం లేదని జగన్ విమర్శించారు.