Begin typing your search above and press return to search.

మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు..

By:  Tupaki Desk   |   21 Jun 2018 6:29 AM GMT
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు..
X
కులాల పేరుతో చంద్రబాబు మరో కుట్రకు తెరతీశాడని వైసీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా రేపల్లెలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోసానికి - వెన్నుపోట్లకు ప్రతిరూపం చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు గొప్ప గొప్ప హామీలు ఇచ్చి మోసం చేస్తాడని.. అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధిగా అమలు చేసే గుణం చంద్రబాబు కు లేదని ఎద్దేవా చేశారు.

కాపులను బీసీల్లో చేరుస్తానన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. దీనిపై ఆందోళనకు దిగిన కాపు నాయకులను జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మత్య్స కారులను ఎస్టీల్లో చేరుస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని.. ఆ సంఘం పెద్దలు శాంతియుతంగా నిరసన చేస్తే.. ముఖ్యమంత్రి తోలు తీస్తానని హెచ్చరించడం దారుణమన్నారు.

సమస్యలను పరిష్కరించమని నాయి బ్రాహ్మాణులు అడిగితే వారిని చంద్రబాబు బెదిరించారని.. వెనుకబడిన కులాలపై చంద్రబాబు చిన్న చూపు చూస్తున్నాడని మోపిదేవి విమర్శించారు. బాబు హామీలు, మోసాలను వైసీపీ తరఫున ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు.