Begin typing your search above and press return to search.

ఆంధ్రా స్వాములంటే కేసీఆర్‌ కు ప్రాణం!

By:  Tupaki Desk   |   19 Jun 2019 1:30 AM GMT
ఆంధ్రా స్వాములంటే కేసీఆర్‌ కు ప్రాణం!
X
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాములోళ్ల హ‌డావుడి ఒక రేంజ్లో సాగుతోంది. ముఖ్య‌మంత్రులే వెళ్లి స్వాములోళ్ల‌ను సంద‌ర్శించుకోవ‌టం పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

మొన్న‌టివ‌ర‌కూ చిన‌జీయ‌ర్ స్వామికి ప్రాధాన్య‌త ఇచ్చిన గులాబీ బాస్.. ఇటీవ‌ల కాలంలో విశాఖ శార‌దా పీఠం స్వ‌రూపానంద‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న పీఠానికి సంబంధించి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేసీఆర్‌ ను.. శార‌దాపీఠాధిప‌తి ఎంత‌గా పొగిడేశారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదంతా చూస్తున్న ప‌లువురు కేసీఆర్ తీరును త‌ప్పు ప‌డుతున్నారు.

స్వాములోళ్ల వ‌ద్ద‌కు వెళ్లొద్ద‌ని చెప్పం కానీ.. పాల‌న మీద దృష్టి పెట్ట‌వేం సారూ అని ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ బ‌లంగా న‌మ్మే ఇద్ద‌రు స్వాములోళ్ల మూలాలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన‌వి కావటం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌తి రంగానికి సంబంధించి తెలంగాణ‌.. ఆంధ్రా అంటూ విభ‌జించి చూసి.. ఆంధ్రాకు జ‌రిగే లాభం.. తెలంగాణ‌కు క‌లిగే అన్యాయం గురించి చెబుతూ మ‌న‌సులు దోచుకునేవారు.

నాటి కేసీఆర్ మాట‌ల్నే నేడు ప్రాతిప‌దిక‌గా తీసుకున్న‌ప్పుడు.. కేసీఆర్ పెద్ద‌పీట వేసే ఇద్ద‌రు స్వాములోళ్లు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారేన‌ని.. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాములోళ్లు ఉండ‌రా?. వారికి సీఎం పెద్ద పీట వేయ‌రెందుకు? అంటూ ప్ర‌శ్నించే వారు కొంద‌రు మొద‌ల‌య్యారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రాస్వాములంటే కేసీఆర్ కు ప్రాణ‌మంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు వాద‌న‌ల‌కు భిన్నంగా.. ఈ స్వాములోళ్ల గోలేంది? ప్ర‌జ‌లు చేతికి అధికారం ఇచ్చింది పాలించ‌టానికా? స్వాములోళ్ల వ‌ద్ద‌కు వెళ్లేందుకా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. స్వాములోళ్లకు అధిక ప్రాధాన్య‌త ఇచ్చిన కేసీఆర్ తీరును త‌ప్పు ప‌డుతున్న తెలంగాణ స‌మాజం స్పంద‌న కేసీఆర్ దాకా వెళుతోందా?