Begin typing your search above and press return to search.

వాట్సాప్ సంచలన నిర్ణయం..అంతా షాక్..

By:  Tupaki Desk   |   21 July 2018 6:31 AM GMT
వాట్సాప్ సంచలన నిర్ణయం..అంతా షాక్..
X
వాట్సాప్.. ఇప్పుడు ఇది లేనిదే పూటగడవని పరిస్థితి. ఒక పూట తినకుండా అయినా ఉండగలుగుతున్నారు కానీ.. వాట్సాప్ లేనిదే ఎవరూ ఉండడం లేదు. వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేసి మరీ తమ ఊసులు, బాసలు చెప్పుకుంటున్నారు. వాట్సాప్ కేవలం సరదాలకే కాదు.. వివిధ ఉద్యోగులు - సంస్థలు కూడా తమ కార్యకలాపాలను కొనసాగించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. దీని ద్వారానే పనులన్నింటిని చక్కబెట్టుకుంటున్నారు. మీడియా సంస్థలు కూడా వాట్సాప్ ద్వారానే తమ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. సమాచార విప్లవంలో వాట్సాప్ చేసిన మేలు అంతా ఇంతా కాదు..

అయితే ఇది ఒక కోణం మాత్రమే. రెండో కోణంలో వాట్సాప్ లో ప్రచారమయ్యే వార్తల వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న తప్పుడు వార్తలు - వదంతులను వినియోగదారులు లక్షల మందికి అన్యపదేశంగా పంపిస్తున్నారు. తప్పుడు వార్తలు అన్నీ వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా వాట్సాప్ తప్పుడు వార్తల కారణంగా మృతి చెందినట్టు కేంద్రం అంచనా వేసింది. పిల్లల కిడ్నాపర్లుగా భ్రమించి అపరిచిత వ్యక్తులను స్థానికులు కొట్టి చంపుతున్న వైనంపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీంతో కట్టుదిట్టమైన చర్యలకు దిగింది.

వాట్సాప్ లో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నియంత్రించాలని తాజాగా కేంద్రం సదరు సంస్థను ఆదేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వాట్సాప్ సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఇకపై ఒకేసారి ఐదుగురికి మాత్రమే సమాచారాన్ని షేర్ చేేసే వీలుంటుందని చెబుతున్నారు. సులభంగా సందేశాన్ని వేరొకరికి పంపే సౌకర్యాన్నికి చెక్ పెడుతూ ఐదుగురికి మాత్రమే షేర్ చేసేలా వాట్సాప్ సాఫ్ట్ వేర్ ను మారుస్తోంది. షేర్ ఐకాన్ ను సైతం తొలగిస్తామని వాట్సాప్ తాజాగా వెల్లడించింది.

తప్పుడు వదంతులు నియంత్రణలో భాగంగానే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఐదు చాట్ లకు మాత్రమే మెసేజ్ లను పంపేలా పరిమితిని విధిస్తున్నట్టు పేర్కొంది. భారత్ లోని వినియోగదారులంతా ఏకకాలంలో ఇక నుంచి ఒక సందేశాన్ని ఐదుగురికి మాత్రమే పంపేలా క్విక్ ఫార్వర్డ్ బటన్ ను తొలగించి నియంత్రణ విధిస్తోంది. వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం.. వినియోగదారుల పాలిట శాపంగా మారింది.