Begin typing your search above and press return to search.

ఈ ఓటముల‌కు ఏం చెప్తారు మోడీ జీ?

By:  Tupaki Desk   |   18 March 2018 5:30 PM GMT
ఈ ఓటముల‌కు ఏం చెప్తారు మోడీ జీ?
X
బీజేపీ ఆశాజ్యోతి, ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గ్రాఫ్ ప‌డిపోతోందా? మోడీ వేవ్‌గా అభివర్ణించిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో నరేంద్రమోడీ నాయకత్వంలో ఏర్ప‌డిన కేంద్ర ప్ర‌భుత్వంపై విశ్వాసం స‌న్న‌గిల్లుతోందా? ఆయా రాష్ర్టాల ఉప ఎన్నిక‌ల్లో ఎదురుగాలి ఎందుకు వీస్తోంది? ఇవి ఇప్పుడు ఇటు బీజేపీ శ్రేణుల‌ను అటు రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. 2014 తర్వాత దేశవ్యాప్తంగా 22 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు బీజేపీని ఇరకాటంలో నెట్టేస్తున్నాయి. మోడీ వేవ్‌ రోజురోజుకూ బలహీనపడుతుందనే సంకేతాలిస్తున్నాయి.

22 స్థానాల్లో బీజేపీ మూడింటిలో విజయం సాధించగా.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్నడూ లేనివిధంగా ఓటమి ఎదురైంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో గెలవటం సహజం. కానీ, ఉపఎన్నికలు జరిగిన 22 స్థానాల్లో బీజేపీ కేవలం మూడింటికే పరిమితం కావడంతో మోడీ చరిష్మా తగ్గుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొదట్లో మోడీపై ఓటర్లు పెట్టుకున్న ఆశలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయనడానికి ఈ ఉప ఎన్నికలే ఉదాహరణలని వారు పేర్కొంటున్నారు.

ప్ర‌ధాని మోడీ ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌లు..ఫ‌లితాలు

2014 - మెయిన్పురి - వడోదర - కందమాల్‌ - మెదక్‌ సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత, మెయిన్పురి, వడోదర లోక్‌సభ స్థానాలకు 2014 సెప్టెంబరులో ఉప ఎన్నికలు జరిగాయి. ములాయం సింగ్‌ యాదవ్‌, నరేంద్ర మోడీ రెండు స్థానాల్లో గెలుపొందగా... మెయిన్పురి, వడోదర స్థానాలకు వారు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మెయిన్పురి నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ప్రతాప్‌ యాదవ్‌ విజయం సాధించగా, మోడీ రాజీనామా చేసిన వడోదర స్థానం నుంచి బీజేపీకి అభ్యర్థి రంజన్‌ బెన్‌ భారీ విజయాన్ని సాధించగలిగారు. కందమాల్‌లో బిజు జనతాదళ్‌ అభ్యర్థి ప్రత్యూష రాజేశ్వరి సింగ్‌ బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. తెలంగాణాలోని మెదక్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు.

2015 - వరంగల్‌ - బాంగన్‌ - కష్ణగంజ్‌ - రాట్లం

2015లో తెలంగాణలోని వరంగల్‌, పశ్చిమ బెంగాల్‌లోని బాంగన్‌, కృష్ణగంజ్‌ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కడియం శ్రీహరిని టీఆర్ఎస్‌ ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నిర్ణయించిన తరువాత వరంగల్‌ లోక్‌సభ స్థానంలో ఖాళీ ఏర్పడింది. బంగాన్‌, కష్ణగంజ్‌లో ఎంపీల అకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ ఘన విజయం సాధించారు. పశ్చిమబెంగాల్‌లోని బంగాన్‌, కష్ణగంజ్‌ స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు మమతా ఠాకూర్‌, సత్యజిత్‌ బిశ్వాస్‌ గెలుపొందారు. రాట్లం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కాంతీలాల్‌ భురియా చేతిలో బీజేపీ ఓటమిపాలయ్యారు.

2016 - తుమ్లుక్‌ - కూచ్‌బెహర్‌ -శాదోల్‌ - లఖింపుర్‌

2016లో నాలుగు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహర్‌, మధ్యప్రదేశ్‌లోని శాదోల్‌ స్థానాల్లో ఆయా సభ్యుల మరణానంతరం ఖాళీ ఏర్పడ్డాయి. ఈ రెండు స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ తమ తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. వీటితోపాటు తుమ్లుక్‌లో కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అసోంలోని లఖింపూర్‌ నియోజకవర్గంలో శర్వానంద్‌ సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా నియమించడంతో ఖాళీ ఏర్పడగా...బీజేపీ ఈ సీటును కాపాడుకుంది.

2017 - గురుదాస్‌పూర్‌ - శ్రీనగర్‌ - అమృత్‌సర్‌ - మల్లప్పురం

2017 సంవత్సరంలో లోక్‌సభ ఉప ఎన్నికలు బీజేపీకి సవాలుగా నిలిచాయి. సినీ నటుడు వినోద్‌ ఖన్నా మరణంతో పంజాబ్‌లోని గురుదాసూపూర్‌ సీటు ఖాళీ అయింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జఖార్‌ దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అలాగే 2017 మార్చిలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన స్థానాన్ని కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి రాజిందర్‌ సింగ్‌ చిన్నాను కాంగ్రెస్‌ అభ్యర్థి గురుజీత్‌ సింగ్‌ అహూజా ఓడించారు. శ్రీనగర్‌ నియోజకవర్గం పీడీపీ ఖాతాలో ఉన్నది. బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వమైన మెహబూబా ముఫ్తీ పార్టీకి చెందిన ఆ పార్టీ ఎంపీ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక జరిగింది. అక్కడ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి ఫరూఖ్‌ అబ్దుల్లా విజయం సాధించారు. కేరళలోని మల్లప్పురంలో ముస్లిం లీగ్‌ అభ్యర్థి గెలుపొందారు.

2018 -అజ్మీర్‌ - అల్వార్‌ - ఉల్బెరియా - అరారియా - గోరఖ్‌పూర్‌ - ఫూల్‌పుర్‌

2018లో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. దేశంలో ఆరు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి..అవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావటం విశేషం. మొదటి దశలో అజ్మీర్‌, అల్వార్‌, ఉల్బెరియా రెండో దశలో అరారియా - గోరఖ్‌పూర్‌ - ఫూల్‌పుర్‌ ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో రాజస్థాన్‌ - అజ్మీర్‌ - అల్వార్‌లో బీజేపీ ఎంపీలు సన్వర్‌లాల్‌ జాట్‌ - మహంత్‌ చంద్‌ నాద్‌ల మరణంతో ఖాళీలు ఏర్పడ్డాయి.