Begin typing your search above and press return to search.

ధూమపానం, మద్యపానం..రెండింటిలో మనం తోపే..

By:  Tupaki Desk   |   1 Jan 2019 9:45 AM GMT
ధూమపానం, మద్యపానం..రెండింటిలో మనం తోపే..
X
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టునన్నాడు మన గిరీషం.. పొగే కాదు.. ఇప్పుడు మందు తాగని వాడు కూడా అదే అంటున్నారు మోడ్రన్ గిరీషంలు.. ఆడవాళ్లు సైతం మద్యం, సిగరెట్ ను కామన్ గా వినియోగిస్తున్న రోజులివీ.. అలాంటి ధూమపానం..మద్యపానంలో మనోళ్లు టాప్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. మద్యం..సిగరెట్ ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వాలు ఢంకా బజాయిస్తున్నా సేవించేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

మద్యంతోపాటు పొగకు అలవాటు పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విక్రయాల విషయంలోనూ రెండింటికీ పెద్ద తేడా ఉండడం లేదు. వివరంగా చెప్పాలంటే నిత్యావసర వస్తువుల్లో ఇవీ చేరిపోయాయన్నట్టు.

*ఎన్ఐఎన్ సర్వేలో విస్తుపోయే నిజాలు

జాతీయ పోషకాహార సంస్థ(నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్) నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ప్రధానంగా మద్యం, ధూమపానం సేవించడంలో మనోళ్లు మొదటి వరుసలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రెండు అతిగా తీసుకునే వారు ఉన్నట్లు తేలింది. సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పొగతాగేవారు ఎక్కువగా ఉంటే, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. మద్యం విషయానికొస్తే మాత్రం రెండు రాష్ట్రాలవారు పోటీ పడి రెండో స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఆహారపు అలవాట్లలో భారీగా మార్పులు రావడంతోపాటు మద్యం, పొగ తాగడం వంటివాటికి ఎక్కువ మంది బానిసలవుతున్నట్లు తేలింది. ఫ్యాషన్ గా మొదలు పెడుతున్నప్పటికీ అవి లేకపోతే కొంత మంది ఎంతటి దారుణానికైనా సిద్ధపడుతున్నట్టు తేలింది..

*రాష్ట్రాలవారిగా పొగ తాగేవారు..

మద్యం, పొగ తాగేవారి వివరాలను రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే పొగ తాగేవారిలో 40.6 శాతంతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు రెండు, కర్ణాటక మూడు, న్యూఢిల్లీ నాలుగో స్థానాల్లో నిలిచియి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక స్మోకింగ్ తక్కువ నమోదైన రాష్ట్రాల్లో బీహార్ 3.9 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మద్యం విషయంలో అండమాన్ నికోబార్ అగ్రస్థానంలో ఉంది. 51.3 శాతంతో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 37.4 శాతంతో రెండో స్థానంలో, రాజస్థాన్ 16.9 శాతంతో మూడో స్థానంలో, గుజరాత్ 12.4 శాతంతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి.

*అతిగా మద్యం సేవిస్తే ఆరోగ్యానికి ముప్పే
అతి ఎప్పడూ ప్రమాదకరమే. అలాంటప్పుడు అతిగా మద్యం సేవించినా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లడం ఖాయమంటున్నారు ఎన్ ఐఎన్ నిపుణులు. మద్యం ఎక్కువైతే కొవ్వు, రక్తపోటు, షుగర్, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మందుతాగేవారికి సిగరెట్ అలవాటు కూడా ఉంటుంది. దాంతోపాటు సిగరెట్ లేకపోతే కిక్ ఉండదు. దీంతో రెండింటికీ బానిసలవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో ధూమపానం అలవాటు ఉన్నవారు 30 శాతం మంది స్మోకింగ్ కూడా చేస్తారని ఎన్ఐఎన్ సర్వేలో వెల్లడైంది.