Begin typing your search above and press return to search.

నంద్యాల గోడ‌ల మీద రాత‌లు తెలిశాయా బాబు?

By:  Tupaki Desk   |   26 July 2017 7:46 AM GMT
నంద్యాల గోడ‌ల మీద రాత‌లు తెలిశాయా బాబు?
X
గ‌తంలో మాదిరి ప‌రిస్థితులు లేవు. ఇప్పుడు ఎవ‌రూ త‌మ మ‌న‌సుల్లోని మాట‌ల్ని అస్స‌లు దాచుకోవ‌టం లేదు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని తాము ఏం అనుకుంటున్నామో.. ఆ విష‌యాన్ని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. చేతిలో ఉన్న అధికారంతో తొక్కి ప‌ట్టేసేలా చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నా.. నిజాల్ని చెప్పాల‌న్న త‌ప‌న‌తో కొంత మంది చెబుతున్న మాట‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

హ‌ద్దులు దాట‌కుండానే.. జ‌రుగుతున్న అన్యాయం గురించి సెన్సెబుల్ గా చెప్పే కొంద‌రి మాట‌లు పాల‌క ప‌క్షానికి గుండె ద‌డ‌ను పెంచేస్తున్నాయి. తాజాగా అలాంటి రాత‌లే క‌ర్నూలు జిల్లా నంద్యాల గోడ‌ల మీద ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఒక అసెంబ్లీ స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక కోసం ఒక రాష్ట్ర స‌ర్కారు యావ‌త్తు త‌న దృష్టిని కేంద్రీక‌రించ‌టం.. టార్గెట్లు పెట్టి మ‌రీ ఓటుబ్యాంకు రాజ‌కీయాల‌కు తెర తీస్తున్నారంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన వార్త‌లు మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. త‌న‌ను క‌లిసి.. స్థానిక సమ‌స్య‌ల్ని వివ‌రిస్తున్న వారికి.. ముందు ఉప ఎన్నిక సంగ‌తి చూడాల‌ని.. అక్క‌డ త‌మ పార్టీ అభ్య‌ర్థిని గెలిపిస్తే.. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తామ‌ని బాబు చెబుతున్న మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఇంతేనా త‌న‌కు ఓటు వేయ‌కుంటే తాను వేసిన రోడ్ల మీద న‌డ‌వ‌కూడ‌ద‌ని.. తాను ఇచ్చే పింఛ‌న్ల‌ను తీసుకోవ‌ద్దంటూ (స‌రిగ్గా ఇలాంటి మాట‌లే చెప్ప‌కున్నా.. మొత్తంగా బాబు మాట‌ల సారాంశం ఇదేన‌న్న విష‌యాన్ని గుర్తించాలి) చెబుతున్న వైనంపై నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఏపీ అధికార‌ప‌క్షంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

త‌మ గుండెల్లో పెరుగుతున్న అసంతృప్తిని గోడ‌ల మీద చూపించేస్తున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. బాబు మీరు త‌ప్పు చేస్తున్నారంటూ సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్న మాట నంద్యాల‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సింగిల్ ట్యాగ్ లైన్లో త‌మ ధ‌ర్మాగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న తీరు చూసిన తెలుగు త‌మ్ముళ్ల‌లో బీపీ పెరిగిపోతుంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఎలా అడ్డుక‌ట్ట వేయాలో అర్థం కాక‌.. బాబు పెట్టే ఒత్తిడిని త‌ట్టుకోలేక తెలుగు త‌మ్ముళ్ల ప‌రిస్థితి చాలా ఇబ్బందిక‌రంగా మారింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. త‌మ్ముళ్ల సంగ‌తే కాదు.. నంద్యాల గోడ‌ల మీద వెలుస్తున్న సింగిల్ లైన్ నినాదం మీద బాబు దృష్టి పెడితే బాగుంటుందేమో?