Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో ఉండి..మాట్లాడేవారంతా ఏపీ ద్రోహులే

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:27 AM GMT
హైద‌రాబాద్‌ లో ఉండి..మాట్లాడేవారంతా ఏపీ ద్రోహులే
X
మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ-బీజేపీల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. త‌మ మిత్ర‌ప‌క్ష‌మ‌నే అంశాన్ని ప‌క్క‌న‌పెట్టి విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. తాజాగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌ లో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడే ఎంపీలు ఆంధ్ర ద్రోహులని మండిప‌డ్డారు. అలాంటి వారికి సిగ్గుంటే ఆంధ్రప్రదేశ్‌ లో నివాసం ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు.

హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్ర విభజన గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి - కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రశ్నించే ఎంపీలు - ఎమ్మెల్యేలు - మంత్రులు అప్రకటిత - స్వయం ప్రకటిత మేధావులు ఆంధ్ర ద్రోహులేనని బీజేవైఎం అధ్య‌క్షుడు ఆరోపించారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ - జేసీ దివాకరరెడ్డి - మాగంటి మురళీమోహన్ హైదరాబాద్‌ లో ఉంటూ రాష్ట్ర సమస్యలపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వారికి సిగ్గుంటే హైదరాబాద్‌ ను వదలి ఆంధ్రప్రదేశ్‌ లో నివాసం ఉంటూ ఇక్కడి సమస్యలపై పోరాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పదేళ్లు అన్యాయం చేసినా పట్టించుకోకుండా - ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ - సమైక్యాంధ్రనే కోరిన కమ్యూనిస్టులు ఏ అర్హతతో రాష్ట్ర విభజన గురించి మాట్లాడతారని బీజేవైఎం అధ్య‌క్షుడు ప్రశ్నించారు.

బీజేపీ కార్యకర్తలు తనపై దాడిచేశారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీని - బీజేపీ నాయకులను - కార్యకర్తలను చెప్పులతో కొట్టాలని ప్రకటించిన సినీ నటుడు శివాజీ వ్యాఖ్యలను బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. శివాజీపై ఎవరూ దాడిచేయలేదని - ప్రధానిని విమర్శిస్తుంటే స్థానికులే అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్ వంటి కొందరు ప్రాంతీయ తత్వాన్ని రగిల్చి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, వారివి రెండు రోజుల ప్రదర్శనలే అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని బీజేవైఎం నాయ‌కుడు ప్ర‌క‌టించారు.