Begin typing your search above and press return to search.

వైసీపీకి ఓటు వేశార‌నే క‌డ‌ప‌పై టీడీపీ కుట్ర‌

By:  Tupaki Desk   |   22 Jun 2018 2:17 PM GMT
వైసీపీకి ఓటు వేశార‌నే క‌డ‌ప‌పై టీడీపీ కుట్ర‌
X
కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ పై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్టింది. అధికార టీడీపీ త‌మ‌తో నాలుగేళ్ల‌పాటు అంట‌కాగి...ఆ స‌మ‌యంలో ఏదో తూతూమంత్రంగా విన‌తిప‌త్రాలు అందించి...ఇప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డంపై ఆ పార్టీ బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. ర‌మేష్ దీక్ష‌కు కౌంట‌ర్ వేయాల్సిందేన‌ని కంక‌ణం క‌ట్టుకున్న బీజేపీ రాయలసీమ ముఖ్య నేతలు ఈ రోజు కడపలో సమావేశం అయ్యారు. టీడీపీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే టార్గెట్‌ చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

అనంత‌రం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రమేష్ దీక్ష 5 కోట్ల రూపాయల ఖ‌ర్చుతో సాగుతో ఫైవ్ స్టార్ విలాసవంతమైన దీక్ష అని ఆరోపించారు. ఫోటోగ్రఫీ ఫోజుతో దీక్షలు చేస్తున్నారని, ఏసీల నడుమ దీక్ష చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం రమేష్ అని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.25 లక్షలు ఇచ్చి దీక్షకు ప్రజలను తరలిస్తున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ``ఎవరిని మోసం చేయాలని దీక్ష చేస్తున్నారు? రాయ‌ల‌సీమ‌కు ఇప్ప‌టివ‌ర‌కు టీడీపీ ఏం చేసింది? రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయగల నిజాయితి టీడీపీకి ఉందా? ఎయిమ్స్‌ను ఎందుకు సీమ నుండి తరలించారు? జిల్లాలోని ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓట్లు వేశారని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు`` అని ఆరోపించారు.

తుని ఘటనలో సీమ ప్రజలను గుండాలుగా చిత్రీకరించారని విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ఆరోపించారు. `సీమలో పరిశ్రమలు - విద్యాసంస్థలు పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కడప జిల్లాను చూపించలేదు? దీనికి ఎంపీ సీఎం రమేష్ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు దీక్షకు పెట్టే ఖర్చు ఉక్కు కార్పస్ ఫండ్ కి ఇస్తే ప్రజలకు ఉపయోగ పడుతుంది కదా? టీడీపీ నాయకులకు కేంద్రం 20 వేల కోట్ల రూపాయల పరిశ్రమ వద్దు... 3 వేల కోట్ల చైనా పరిశ్రమ కావాలి అంటున్నారు. ఇదేం నీతి?` అని ప్ర‌శ్నించారు. బీజేపీ కచ్చితంగా జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిందా అని టీడీపీ నాయకులకు విష్ణువ‌ర్ద‌న్ సూటి ప్రశ్న వేశారు.