Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ తో బీజేపీ ముఖ్య నేత భేటీ..సీబీఐకి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   24 April 2018 4:17 AM GMT
జ‌గ‌న్‌ తో బీజేపీ ముఖ్య నేత భేటీ..సీబీఐకి ఫిర్యాదు
X
ఏపీ బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నాయకుడు విష్ణ‌కుమార్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఏపీ రాజ‌కీయాలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు - టీడీపీ - ప్ర‌తిప‌క్ష వైసీపీపై ప‌లు కీల‌క వ్యాఖ్యలు చేశారు. పార్టీ తాజా మాజీ అధ్య‌క్షుడు హ‌రిబాబుతో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం చేరుకున్నాక... తన మామ కోసం ఆయనను కలుస్తానని సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఇక త‌మ‌పై ఇటీవ‌ల విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీపై ఘాటుగానే విరుచుకుప‌డ్డారు. 2014లో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ చాలా నష్టపోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత అయిన‌ విష్ణుకుమార్‌ రాజు మండిప‌డ్డారు. చంద్రబాబు దీక్షలో ప్రధాని మోడీ మీద బాలయ్య చేసిన విమర్శలు గర్హనీయమని ఆయ‌న తెలిపారు.

టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే.. ఇరవై ఎమ్మెల్యే - పది ఎంపీ సీట్లు గెలిచేవాళ్ళమని విష్ణుకుమార్ రాజు అన్నారు. టీడీపీ ఓ కుటుంబ పార్టీ అని విమర్శిస్తూ...తెలుగుదేశం 2019లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. మే15 తరువాత టీడీపి నుంచి వైసీపీలోకి వలసలు ఉంటాయని విష్ణుకుమార్‌ రాజు జోస్యం చెప్పారు. దమ్ముంటే కేసులు పెట్టాలంటూ కొందరు టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారని.. త్వరలోనే వారి కోరిక తీరుస్తామని తేల్చి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దీక్ష అయిపోయిందని, దాని వల్ల రాష్ట్ర ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు జరుగుతుందని కాదని..సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని..ఇప్పుడు మాట మారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. పెట్రోలు - డీజిలు ధరలు తగ్గేలా కేంద్రం సుంకాలు తగ్గించే పనిలో ఉందని అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినందునే దేశంలో వాటి రేట్లు పెరుగుతున్నాయని ఆయ‌న పేర్కొన్నారు. బీజేపీ ఏపీ కొత్త అధ్యక్షుడిని అధిష్టానం అన్ని అంశాలూ పరిశీలించి నియమిస్తుంద‌ని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు.

తిరుపతిలో 30 వ తేదీ దీక్షలో మోడీ ఇచ్చిన హామీ గురించి మాటాడేముందు చంద్రబాబు తాను ప్యాకేజి కి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలని తాజా మాజీ అధ్య‌క్షుడు - విశాఖ ఎంపీ హ‌రిబాబు డిమాండ్ చేశారు. 2019లో ఏపీలో బీజేపీ ఇప్పటికన్నా బలపడుతుందని, ఇప్పుడు నలుగురు శాసన సభ్యులు - ఇద్దరు పార్లమెంటు సభ్యులు కంటే పెద్ద సంఖ్య‌లో స‌భ్యులను చూస్తార‌ని అన్నారు. ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందే దిశగా ఆలోచన చేయాలని, కాంగ్రెస్ తో కలిసి బీజేపీని గద్దె దింపాలని తీర్మానాలు చేయటం హాస్యాస్పదం అని హరిబాబు అన్నారు. పార్టీలోకి అధ్యక్షపదవి ఇస్తేనే వస్తామని ఎవరూ రాలేదని - అధ్యక్ష పదవి ఇస్తామని మేము ఎవరినీ చేర్చుకోలేదని హరిబాబు తెలిపారు. పార్టీలోకి నేతలు వస్తుంటారు, కొందరు పోతుంటారు - దానివల్ల బీజేపీ బలహీన పడదని హరిబాబు అన్నారు. విశాఖ జోన్ వస్తోందని తెలిసి అదేదో తానే సాధిస్తానని మంత్రి గంటా అనటం విడ్డూరమని హ‌రిబాబు ఎద్దేవా చేశారు.