Begin typing your search above and press return to search.

బాబును ఇర‌కాటంలో ప‌డేసేలా ఎమ్మెల్యే డిమాండ్

By:  Tupaki Desk   |   22 July 2017 5:33 PM GMT
బాబును ఇర‌కాటంలో ప‌డేసేలా ఎమ్మెల్యే డిమాండ్
X
రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన విశాఖ భూ కుంభకోణం విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు నియమించిన‌ సిట్ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబును టార్గెట్ చేసి ఇప్ప‌టికే విప‌క్షాలు ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కోవ‌లోకి కొద్దికాలం క్రితం మిత్ర‌ప‌క్ష‌మైన‌ బీజేపీ సైతం చేరింది. బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ - ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు సైతం అవినీతిపై ఘాటుగా రియాక్ట‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ తాజాగా సిట్‌ ను కలిసి భూ కుంభకోణాలపై ఆధారాలను సమర్పించారు. రికార్డుల ట్యాంపరింగ్‌ - ఆక్రమణలు - కబ్జాలపై ఆయన సిట్‌ కు ఫిర్యాదు చేశారు. ముదపాక భూములు - చిట్టివలసలో 41 ఎకరాలు - పాయకారావుపేట రాజవరంలో 144 ఎకరాలు, మాధవధారలోని 2 ఎకరాలకు సంబంధించిన విష్ణుకుమార్‌ అధికారులకు ఫిర్యాదు చేశారని స‌మాచారం.

సిట్‌కు ఫిర్యాదు చేసిన అనంత‌రం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ క‌బ్జాకు గురైన‌ భూముల విషయంలో ఎక్కువగా ట్యాంపరింగ్‌ అయింది ప్రైవేట్‌ భూములేనని తెలిపారు. ఫిర్యాదులకు గడువు పెంచి, సిట్‌ పరిధిలోని కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా పరిష్కరించాలని, కేసుల విచారణకు మరో సిట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే పీలా గోవింద్‌ పై ఆరోపణలతో తాను ఏకీభవించడంలేదని, భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని కోరారు. రికార్డులు తారుమారు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉండ‌గా...విశాఖ భూ కుంభకోణాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల కబ్జాలు - దురాక్రమణలు - క్రయ - విక్రయాలకు సంబంధించి నిరభ్యంతర సర్టిఫికెట్లు (ఎన్‌ ఓసి) జారీపై కూడా సిట్ దర్యాప్తు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పుడు పలు ప్రభుత్వ శాఖలు తమ భూముల దురాక్రమణలపై సిట్‌ కు నివేదికలు ఇస్తున్నాయి. తాజాగా సింహాచలం దేవస్థానం నుంచి అధికారిక బృందం సిట్ దర్యాప్తు అధికారులను కలిసి నివేదిక అందజేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణలపై సిట్ పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో సింహాచలం దేవస్థానం అధికారులు తమ భూములకు సంబంధించి ఆక్రమణల చిట్టాతో నగర పోలీసు కమిషనర్ యొగానంద్‌ తో కలిసి సిట్ విచారణ అధికారికి సమర్పించింది. దేవస్థానం ఆధీనంలో ఉన్న పద్మనాభం మండలం అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి చెందిన పలు భూములు ఆక్రమణలకు గురైనట్టు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే మాన్సాస్ ఆధీనంలోని పలు దేవస్థానాలు - సత్రాలు - విద్యా సంస్థలకు చెందిన భూముల ఆక్రమణలపై కూడా సిట్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పద్మనాభం మండలం గంగసాని అగ్రహారంలో విశ్వేశ్వ‌ర స్వామి దేవస్థానానికి చెందిన భూములు, నీలమ్మ సత్రానికి చెందిన భూముల వ్యవహారాలను సిట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం. వీటితో పాటు మాన్సాస్ సంస్థకు చెందిన భూముల ఆక్రమణల అంశాన్ని కూడా సిట్ దృష్టికి తీసుకువచ్చినట్టు స‌మాచారం.