Begin typing your search above and press return to search.

సెహ్వాగ్ మామూలోడు కాడు..

By:  Tupaki Desk   |   27 Feb 2017 11:14 AM GMT
సెహ్వాగ్ మామూలోడు కాడు..
X
బంతులకు చుక్కలు చూపించడంలో దిట్టయిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ కు రిటైర్మెంటు ఇచ్చినా తన దూకుడుకు మాత్రం రిటైర్మెంటు ఇవ్వలేదు. ట్విట్టర్ లో ఆయన తన హార్డ్ హిట్టింగ్ తో అభిమానులను అలరిస్తున్నాడు. ఏ సందర్భం వచ్చినా వదలకుండా ట్వీట్లు చేసే సెహ్వాగ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. తన రికార్డుల్లో ఉన్న ట్రిపుల్ సెంచరీలు తనవి కావని.. అవన్నీ తన బ్యాట్ చేసిందని చెబుతూ ఆయన చేసిన ట్వీటు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. అయితే.. ఆయన ట్వీటు వెనుక నేపథ్యం ఆధారంగా దాన్ని విమర్శిస్తున్నవారూ ఉన్నారు.

ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌ మెహర్ కౌర్‌ చేసిన ఓ పోస్టింగ్‌ కు రిప్లయి ఇస్తూ సెహ్వాగ్ ఈ ట్వీట్ చేశాడు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్‌మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్‌మెహర్.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. అంతకుముందు తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుర్‌మోహర్ చేసిన ఆ పోస్టింగుకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు.

వీరూ ట్వీట్ కు నెటిజెన్లు స్పందించారు. వీరిలో సెలెబ్రిటీలు, రచయితలు ఉన్నారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికి వీరూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. వీరూ గతంలోనూ క్రికెట్, రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చతురతో కూడిన ట్వీట్లతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/