Begin typing your search above and press return to search.

చెట్టుకోసం ఐటీ కంపెనీపై పోరాటం

By:  Tupaki Desk   |   29 July 2016 5:30 PM GMT
చెట్టుకోసం ఐటీ కంపెనీపై పోరాటం
X
తమిళనాడులోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన ప్రజలు ఓ చెట్టు కోసం ఆందోళన నిర్వహిస్తున్నారు. దాని కోసం ఐటీ కంపెనీని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ కంపెనీపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇపుడు ఐటీ కంపెనీ వ‌ర్సెస్ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది.

పెరుంగుడి ప్రాంతంలో వందేళ్ల నాటి ఓ మర్రి చెట్టు ఉంది. ఇది చాలా పెద్దది. ఊడలు - కొమ్మలతో విశాలమైన ప్రాంతాన్ని ఈ చెట్టు ఆక్రమించుకుని ఉంటుంది. దీంతో అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆ చెట్టుతో అనుబంధం ఉంది. దాని ఊడలతో ఆడుకుని - దాని ఆకులు తెంచుకుని - దాని పళ్లు చిదిమి - దాని నీడలో ఆడుకుని అక్కడి వారంతా పెరిగి పెద్దవారయ్యారు. ఆ విధంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలోని ఒక పేజీని ఆ చెట్టు ఆక్రమించింది. అలాంటి చెట్టు ఒకటి ఇటీవల ఉన్నట్లుండి ఎండిపోసాగింది. ఏడాది క్రితం వరకు ఎంతో పచ్చగా - ఆరోగ్యంగా ఉన్న చెట్టు ఒక్కసారిగా ఎండిపోవడం ప్రారంభించింది. దీంతో అక్కడి వారిలో అనుమానం మొదలైంది. దీంతో చెట్టుపై విష ప్రయోగం జరిగిందని అనుమానించడం మొదలు పెట్టారు. ఆ చెట్టు ఎదురుగా ఉన్న ఐటీ పార్క్‌ కు సంబంధించినవారు దానిపై విష ప్రయోగానికి దిగి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఐటీ పార్క్‌ కు చెందిన వారు ఆ చెట్టు వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయడం ద్వారా దానిని ఎండిపోయేలా చేశారని ఆరోపిస్తున్నారు. వారి ఆందోళనతో ఆ చెట్టును పరిశీలించిన నిపుణుల బృందం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తోంది' అని పేర్కొన్నారు. దీంతో అక్కడి వారి అనుమానాలు నిజమనే భావన కలిగింది. దీంతో ఐటీ పార్కుపై న్యాయ పోరాటానికి సిధ్ధమవుతున్నారు. కాగా, 80 శాతం చెట్టు ఎండిపోవడంతో చెట్టు భాగాలను చాలా వరకు తొలగించారు. ఈ వ్యవహారంపై హార్టీకల్చర్ నిపుణులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు.