Begin typing your search above and press return to search.

అంతమంది చచ్చిపోతే సోయి లేదు.. కుక్క చచ్చిపోతే కేసా?

By:  Tupaki Desk   |   15 Sep 2019 5:25 AM GMT
అంతమంది చచ్చిపోతే సోయి లేదు.. కుక్క చచ్చిపోతే కేసా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు తప్పుల్ని విపక్షం ఒక రేంజ్ లో విరుచుకుపడుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలట్లేదు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై సామాన్య ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. కేసీఆర్ తీరును తప్పు పట్టే అంశాల మీద విపక్షాలు తమ ఫోకస్ ను మరింత పెంచాయి. తాజాగా ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబం ప్రేమగా పెంచుకునే హస్కీ అనే కుక్కపిల్ల అనారోగ్యంతో మరణించటం.. దానికి వైద్యం చేసిన వైద్యుడి నిర్లక్ష్యమే కుక్క ప్రాణాలు పోవటానికి కారణమంటూ కేసు పెట్టటం.. దాన్ని రిజిస్టర్ చేయటం జరిగిపోయాయి.

ఈ ఉదంతంపై పలువురు నేతలు.. రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతి తన ఫేస్ బుక్ పోస్టుతో చెలరేగిపోయారు. తీవ్ర ఆవేశానికి.. ఆగ్రహానికి.. ఆవేదనకు గురైన ఆమె.. తెలంగాణలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు తల దించుకుంటున్నట్లు చెప్పారు.

కుక్క ఎపిసోడ్ పై ఫేస్ బుక్ లో విజయశాంతి రాసుకొచ్చిన పోస్టును యథాతధంగా చూస్తే..

‘‘తెలంగాణ సీఎం కెసిఆర్‌ గారి క్యాంపు కార్యాలయంలో కుక్క ప్రాణాలకు ఉన్న విలువ కూడా తెలంగాణ ప్రజలకు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. విషజ్వరాల బారినపడి... తెలంగాణలోని అమాయక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఆరోగ్యశాఖ అధికారులపై చర్యలు ఉండవు. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పచెప్పి.. ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు చాలామంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినా... దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు ఉండవు.

కానీ... సీఎం కేసీఆర్‌ గారు - ఆయన కుటుంబసభ్యులు ఎంతో ప్రేమగా పెంచుకున్న హస్కీ అనే కుక్క జ్వరం వచ్చి చనిపోతే మాత్రం చర్యలు మామూలుగా లేవు. ఆ కుక్కకు సరైన విధంగా వైద్యం అందించకపోవడంతోనే మరణించిందనే కారణంతో.. దానికి చికిత్స చేసిన డాక్టర్ రంజిత్‌పై ఐపీసీ 429 సెక్షన్ 11(4) కింద - ప్రివెంటివ్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయింది.

కేసీఆర్ అనుసరిస్తున్న ఈ దొరతనాన్ని సహించలేకే ఇటీవల కాలంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారనే వాదన కూడా ఉంది. అసమ్మతి గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను ప్రలోభపెట్టి బెదిరించి కేసీఆర్‌ గారు లొంగ తీసుకోవచ్చేమో గానీ సంక్షోభాన్ని ఎంతో కాలం నివారించలేరంటూ ఆమె మండిపడ్డారు.