Begin typing your search above and press return to search.

రాముల‌మ్మ లీడ‌ర్ కాదు.. కార్య‌క‌ర్త మాత్ర‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:44 AM GMT
రాముల‌మ్మ లీడ‌ర్ కాదు.. కార్య‌క‌ర్త మాత్ర‌మేన‌ట‌!
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాముల‌మ్మ అలియాస్ విజ‌య‌శాంతి తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. సోష‌ల్ మీడియా ద్వారా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే ఆమె.. ఇటీవ‌ల కాలంలో మీడియాతో నేరుగా మాట్లాడ‌టం త‌గ్గించేశారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీల‌క స‌మావేశాల‌కు రాములమ్మ‌కు ఆహ్వానం ఇవ్వ‌రా? అన్న సందేహం వ‌చ్చేలా తాజాగా ఆమె వ్యాఖ్య‌లు ఉన్నాయి. తాజాగా గోల్కొండ హోట‌ల్ లో తెలంగాణ పీసీసీ కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. దీనికి మీరెందుకు హాజ‌రు కాలేదంటూ విజ‌య‌శాంతిని మీడియాను అడ‌గ‌టంతో ఆమె ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని ఇచ్చారు.

గోల్కొండ హోట‌ల్లో పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింద‌న్న విష‌యం త‌న‌కు తెలీద‌ని.. అందుకు సంబంధించిన స‌మాచారం త‌న‌కు ఇవ్వ‌లేద‌న్నారు. పార్టీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు ఎన్నిక‌ల వ‌రకే ప‌ర‌మిత‌మ‌ని చెప్పిన ఆమె.. తాను నేత‌ను కాద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.

తాను సోనియాగాంధీ గౌర‌వించి కండువా క‌ప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న‌కార్య‌క‌ర్త‌నంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. సోనియాగాంధీ లాంటి నేత త‌న‌ను గుర్తించి.. గౌర‌వ‌మిస్తే పార్టీ నేత‌లు మాత్రం త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌న్న విష‌యాన్ని ఫైర్ బ్రాండ్ త‌న మాట‌ల్లో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా చెప్పాలి. రాముల‌మ్మ మాట‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.