Begin typing your search above and press return to search.

రాములమ్మ భావోద్వేగం..శ్రీనివాసరెడ్డి మరో శ్రీకాంతాచారి

By:  Tupaki Desk   |   13 Oct 2019 4:25 PM GMT
రాములమ్మ భావోద్వేగం..శ్రీనివాసరెడ్డి మరో శ్రీకాంతాచారి
X
ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నానాటికీ ఉధృతమవుతోందనే చెప్పాలి. తాము విధించిన గడువులోగా విధులకు రాకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగిచ్చిన కేసీఆర్ సర్కారు అన్నంత పని చేయడంతో పాటుగా కొత్తగా కార్మికుల నియామకాలను కూడా చేపట్టేసింది. ఈ క్రమంలో ఖమ్మంలో శనివారం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి ఆదివారం చనిపోయారు. ఇప్పుడు ఈ ఘటన తెలంగాణ సర్కారును వణికిస్తోందనే చెప్పాలి. ఇదే ఘటనను ఆధారం చేసుకుని టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ - మాజీ ఎంపీ విజయశాంతి భావోద్వేగానికి గురయ్యారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై రాములమ్మ భావోద్వేగం నిజంగానే కదిలించేదేనని చెప్పక తప్పదు.

శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై రాములమ్మ భావోద్వేగం ఎలా సాగిందన్న విషయానికి వస్తే... తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమని విజయశాంతి తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్య కానీ... వాటిని చూసి చలించే తత్వం దొరగారికి లేదనే విషయం పలు సందర్భాల్లో రుజువైందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే... బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చని విజయశాంతి పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై ఓ వైపు ప్రాణ త్యాగాలకు ఉద్యోగులు సిద్ధపడుతుంటే.. కేసీఆర్ స్పందించిన తీరు ఆయన నిరంకుశ పాలనకు అద్దంపడుతోందని ఆమె విమర్శించారు.

సమ్మె ప్రభావం లేకుండా అన్ని ప్రత్యామ్నాయ చర్యలూ తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు తిరుగుతున్నాయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన రాములమ్మ.... ఆర్టీసీ సమ్మె కారణంగా మరో వారం రోజుల పాటూ బడులకు దసరా సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని, నిజంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే, స్కూళ్లకు సెలవులు ఎందుకు పొడిగించారో వివరణ ఇవ్వాలని విజయశాంతి డిమాండ్ చేశారు. టీఆర్‌ ఎస్ సర్కారు వైఖరిని చూస్తుంటే... మళ్లీ బస్సులు సజావుగా నడిచే వరకు పాఠశాలల సెలవులను పొడిగిస్తారేమో అన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. అదే గనుక జరిగితే పాఠశాలలకు దసరాకు మొదలైన సెలవులు సంక్రాతి వరకు కొనగాగుతాయేమోనని ప్రభుత్వంపై విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.