Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను తిట్టబోయి ఉత్తమ్ ను..

By:  Tupaki Desk   |   26 March 2019 10:03 AM GMT
కేసీఆర్ ను తిట్టబోయి ఉత్తమ్ ను..
X
రాములమ్మ నోరు జారారు.. చిక్కుల్లో పడ్డారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను బేస్ చేసుకొని పరుషంగా తిట్టబోయి సొంత పార్టీ అధ్యక్షుడిపై నోరుపారేసుకున్నారు. ఇప్పుడు విజయశాంతి వ్యవహారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి మెదక్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సింహగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కేసీఆర్, టీఆర్ ఎస్ పై నిప్పులు కురిపించారు. వెయ్యిమంది కేసీఆర్ కు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని వార్నింగ్ ఇచ్చారు.. దొరా కేసీఆర్ కాంగ్రెస్ ను భూస్థాపితం చేద్దామని కంకణం కట్టుకున్నవా.. అది నిన్ను సృష్టించిన దేవుడు వల్ల కూడా కాదు అని ఆడిపోసుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నీ అంతుచూస్తుందని.. కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసి కొత్త జీవాన్నిచ్చావని.. ఎన్నికల తర్వాత కొత్త నాయకత్వంలో ముందుకు సాగుతాం అంటూ విజయశాంతి రెచ్చిపోయారు.

అయితే చివరి పదాలు మాత్రమే మీడియాలో హైలెట్ అయ్యారు. కొత్త నాయకత్వంలో ముందుకు సాగుతాం అంటూ విజయశాంతి పలికిన వీడియో మీడియాలో హైలెట్ అయ్యింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ అలసత్వం వల్లే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయశాంతి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి.

ఇది దుమారం రేగడంతో తాజాగా విజయశాంతి వివరణ ఇచ్చారు. తాను అన్నది పీసీసీ చీఫ్ గురించి కాదని.. ఎన్నికల తర్వాత గెలిచే కొత్త నాయకుల ఆధ్వర్యంలో ముందుకు వెళతామని వివరణ ఇచ్చింది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.