Begin typing your search above and press return to search.

పవన్ ను చూసి పగలబడి నవ్వుకుంటారు..

By:  Tupaki Desk   |   26 March 2019 10:55 AM GMT
పవన్ ను చూసి పగలబడి నవ్వుకుంటారు..
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, పవన్, పరిటాల శ్రీరామ్ దుమ్ముదులిపేశాడు. జనసేనతో లోపాయికారి పొత్తు వల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు, పవన్ కు అర్థమైందని విమర్శించారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని.. భారీ ఓటమి నుంచి తప్పించుకోలేరని.. ప్రజలు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.

*పరిటాల శ్రీరామ్ ఆగడాలు ఆపేవారే లేరా?
పరిటాల శ్రీరామ్ అధికార పార్టీ అండతో రాప్తాడు నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నాడని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో 20 వాహనాల భారీ కాన్వాయ్ తో వెళ్తూ ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తున్నాడని.. ఎన్నికల అధికారులు అన్ని వాహనాలకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అనుమతి లేకుంటే ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

*పవన్ ఈతచాప, పిడతల అన్నం నమ్మరు..
పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఈత చాపపై కూర్చొని మట్టి పిడతలో పెరుగన్నం తింటున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై విజయసాయి రెడ్డి సూటిగా ట్విట్టర్ లో ప్రశ్నించారు. 30-40 ఏళ్ల కింద ఇటువంటి వేశాలు వేస్తే జనాలు నమ్మేవారేమో.. రూ.52 కోట్ల ఆస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో చూపించి.. మహాత్మాగాంధీ అంత సాధారణ వ్యక్తినని షో చేస్తే ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు..’ అని పవన్ పై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.