Begin typing your search above and press return to search.

బాబు ద‌గ్గ‌ర జేడీ ట్యూష‌న్ చెప్పించుకోవాల‌ట‌!

By:  Tupaki Desk   |   20 April 2019 7:23 AM GMT
బాబు ద‌గ్గ‌ర జేడీ ట్యూష‌న్ చెప్పించుకోవాల‌ట‌!
X
వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఏమాత్రం త‌గ్గ‌ట్లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనే కాకుండా అంత‌కుముందు కూడా వైరి వ‌ర్గాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు గుప్పిస్తూ సాగుతున్న సాయిరెడ్డి... తాజాగా నిన్న సీబీఐ మాజీ జేడీ - జ‌న‌సేన విశాఖ ఎంపీ అభ్య‌ర్థి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. దానికి ల‌క్ష్మీనారాయ‌ణ కూడా ఘాటుగానే స్పందిస్తూ... విజ‌య‌సాయిరెడ్డి త‌ప్పుడు లెక్కల కార‌ణంగా ఆయ‌న‌తో పాటు చాలా మంది ఇరుక్కున్నారంటూ సెటైర్ సంధించారు. ల‌క్ష్మీనారాయ‌ణ సెటైర్ తో విజ‌య‌సాయిరెడ్డి కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంద‌ని - ఇక‌పై విజ‌య‌సాయిరెడ్డి కాస్త ఆలోచించే విమ‌ర్శ‌లు చేస్తార‌న్న వాదనా వినిపించింది.

అయితే తాను ఏ విమ‌ర్శ చేసినా... బాగా ఆలోచించ‌డంతో పాటుగా పూర్తి క్లారిటీతోనే విమ‌ర్శ‌లు గుప్పిస్తాన‌న్న రీతిలో కాసేప‌టి క్రితం విజ‌య‌సాయిరెడ్డి మ‌రోమారు ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చారు. నిన్న తాను టార్గెట్ చేసిన‌ - త‌న‌ను తిరిగి ఏకేసిన ల‌క్ష్మీనారాయ‌ణను మ‌రోమారు టార్గెట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి.. జ‌న‌సేన పోటీ చేసింది 65 సీట్ల‌లోనేన‌న్న విష‌యాన్ని మ‌రోమారు ప్ర‌స్తావించారు. టీడీపీతో కుదిరిన లోపాయికారి ఒప్పందాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన విజ‌య‌సాయిరెడ్డి... జ‌న‌సేన పోటీ చేసింది ముమ్మాటికీ 65 సీట్లేన‌ని కాస్తంత గ‌ట్టిగానే చెప్పేశారు.

అంతేకాకుండా జ‌న‌సేన‌ను ఆ పేరుతో కాకుండా పార్టీ గుర్తు గ్లాసు పార్టీగా అభివ‌ర్ణించేసిన విజ‌య‌సాయిరెడ్డి... ఆ పార్టీలో జేడీ ఏమిటో త‌న‌కు తెలియ‌ద‌ని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్ర‌బాబుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన బీ పారాలు పోను జ‌న‌సేన‌కు మిగిలింది 65 సీట్లేన‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న లెక్కేమిటో చెప్పేశారు. ఇక ఆ త‌ర్వాత ప్ర‌జాశాంతి పార్టీ నేత కేఏ పాల్ పేరునూ ప్ర‌స్తావించిన సాయిరెడ్డి... పాల్ ఎన్నిక‌ల్లో నిల‌బెట్టిన డమ్మీల మాదిరే ప‌వ‌న్ కూడా 80 సీట్ల‌లో డ‌మ్మీల‌ను దించార‌ని మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సెటైర్ సంధించారు. అయినా ఈ లెక్క‌ల‌న్నీ తెలియ‌క‌పోతే - తిక‌మ‌క‌గా ఉంటే... చంద్ర‌బాబు వ‌ద్ద ట్యూష‌న్ చెప్పించుకోవాల‌ని ఘాటు విమ‌ర్శ చేశారు.

మొత్తంగా త‌న‌ను ఓ రేంజిలో టార్గెట్ చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ‌ను... సాయిరెడ్డి అంత‌కు మించిన రేంజిలో టార్గెట్ చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా సాయిరెడ్డి తాజా ట్విట్ లో ఏ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... *జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌ కు వెళ్ళండి* అని విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు.