Begin typing your search above and press return to search.

బాబు ఇంటికి సీబీఐని పంపితే వ‌జ్రాలు దొరుకుతాయి

By:  Tupaki Desk   |   23 May 2018 8:48 AM GMT
బాబు ఇంటికి సీబీఐని పంపితే వ‌జ్రాలు దొరుకుతాయి
X
టీటీడీ మాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులు చేసిన ఆరోప‌ణ‌ల‌తో భ‌క్తుల్లో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. చంద్ర‌బాబు మీద ఆయ‌న ప‌లుమార్లు సంచల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం తిరుమ‌ల న‌డ‌వ‌డం లేద‌ని ర‌మ‌ణ దీక్షితులు చేసిన ఆరోప‌ణ‌లు ప‌లువురిని క‌ల‌త‌కు గురిచేసిన విష‌యం తెలిసిందే. అయితే, న‌గల అదృశ్య ఆరోప‌ణ‌ల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ - రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌ సాయిరెడ్డి స్పందించారు.

తిరుమల పోటు నేలమాళిగలో త‌వ్వ‌కాలు జ‌రిపార‌న్న ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌సాయిరెడ్డి ఆ విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ - అమరావతిలలో ఉన్న తన నివాసాలకు తరలించారని ఆరోపించారు. ఇప్ప‌టికిపుడు కేంద్రం సీబీఐ సోదాలకు ఆదేశించి 12 గంటల్లోపల చంద్రబాబు నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడటం ఖాయం అని ఆయ‌న అన్నారు.

చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే తన పదవికి వెంటనే రాజీనామా చేస్తానని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 12 గంటల కంటే ఎక్కవ సమయం ఇస్తే ... ఆ ఆభరణాలన్నీ విదేశాలకు తరలిపోతాయని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. కేవలం హెరిటేజ్ సంస్థల వ్యాపారం చేసి ఇన్ని వేల కోట్ల ఆస్తులు చంద్ర‌బాబు ఎలా కూడ‌బెట్ట‌గ‌ల‌డ‌ని ప్ర‌శ్నించారు. ఇలాంటి అక్ర‌మాలు చేయ‌బ‌ట్టే చంద్ర‌బాబుకు అన్ని ఆస్తులున్నాయ‌న్నారు. లోకేష్‌ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ఆయ‌న మాట్లాడారు. లోకేష్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మ‌రి అంత న‌మ్మ‌కం ఉంటే... సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు, విచార‌ణ చేస్తే వారెంత ముత్యాలో తెలుస్తుంది క‌దా అని అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గంటా శ్రీ‌నివాస‌రావుకు నీతినియామ‌లు, విలువ‌లు లేవ‌ని మండిప‌డ్డారు. ఆయ‌న గోడ మీద పిల్లి లాంటి వారని, అధికారంలో ఉండే పార్టీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉంటార‌ని మండిప‌డ్డారు. గంటా డ‌బ్బు మ‌నిష‌ని, తాను విమర్శించేందుకు కూడా ఆయ‌న‌ అర్హుడు కారని ఎద్దేవా చేశారు. జంప్ జిలానీగా పేరున్న గంటా...అనేక పార్టీలు మారి...ఇపుడు వైసీపీలో చేరేందుకు కూడా సంప్రదింపులు జరుపుతున్నార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కూడా విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ఆయ‌న నష్ట జాతకుడని, అ`ధర్మ` పోరాటం చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాలన్ని అపవిత్రం చేశారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఓ దొంగ అని, నాట‌కాలాడే వ్యక్తి అని మండిప‌డ్డారు.

చంద్ర‌బాబు అడుగుపెట్ట‌డంతో ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం మైల‌ప‌డింద‌ని, అందుకే దానిని గంగాజలంతో శుద్ధి చేయ‌బోయామ‌ని అన్నారు. అయితే, పోలీసులు త‌మ‌ను అడ్డుకున్నార‌ని, వారంతా టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో విశాఖ ఎయిర్‌ పోర్టు రన్ వే పైనే జగన్ ను సీపీ యోగానంద్ ఇదే త‌ర‌హాలో అడ్డుకున్నార‌ని, ఆ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశామ‌ని అన్నారు. కులపిచ్చి ఉన్న యోగానంద్‌.... పోలీసులను టీడీపీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని మండిప‌డ్డారు. విశాఖపట్టణంలో జ‌రిగింది అ`ధర్మ`పోరాట సభ అని, అన్యాయమైన సభ అని ఎద్దేవా చేశారు. విశ్వవిద్యాలయంలో రాజ‌కీయ స‌భ‌లు నిర్వహించకూడ‌దన్న జీవోను ఏయూ వీసీ - రిజిస్ట్రార్ తుంగ‌లో తొక్కార‌ని అన్నారు. చంద్ర‌బాబు దొంగ అని, నాట‌కాలాడుతూ ప్ర‌జ‌ల‌ను, ప్రతిపక్షాన్నిమోసం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్టేందుకు వైసీపీ కార్యకర్తల మీద, సానుభూతిపరుల‌పైనా దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.