Begin typing your search above and press return to search.

బాబు బీపీ పెంచేలా విజ‌య‌సాయి తాజా స‌వాల్‌

By:  Tupaki Desk   |   15 April 2018 12:11 PM GMT
బాబు బీపీ పెంచేలా విజ‌య‌సాయి తాజా స‌వాల్‌
X

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్యంగా వైసీపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి స‌వాల్లు విసురుతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్టేలా హోదా విష‌యంలో ప‌లు స‌వాల్లు విసిరిన విజ‌యసాయిరెడ్డి తాజాగా అదే రీతిలో మ‌రో ప్ర‌తిపాద‌న పెట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్య‌మని అంటున్న చంద్ర‌బాబు అందులో నిజాయితీ ఉంటే...రాజీనామాల‌కు సిద్ధ‌మో కాదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో విజయసాయిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొమ్ములు కూడబెట్టుకొని విదేశాల్లో దాచుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నాడని విమర్శించారు.

టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. టీడీపీకి చెందిన ఎంపీలు, అసెంబ్లీ, శాసనమండలిలోని మొత్తం సభ్యులందరూ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళదామని, ప్రజా తీర్పును కోరదామని అన్నారు. ఏపీ ప్రజలు నిజంగా ప్రత్యేకహోదా కోరుకుంటున్నారా? లేదా? అనేది ప్రజాతీర్పు ద్వారానే తెలుసుకుందామంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. ప్రత్యేకహోదా అనేది సంజీవనేనని, కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా చేసిన ఘనత టీడీపీదేనని, కొన్ని రాజకీయపార్టీలతో లాలూచీపడి ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు అవకాశాన్ని బట్టి మాట మార్చే వ్యక్తి అని విజ‌య‌సాయిరెడ్డి దుయ్యబట్టారు. విభజన అంశాలు - ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఎంత సేపు రాష్ట్ర సంపదను ఎలా దోచుకోవాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. అప్పుడు ప్యాకేజీ మేలని దోచుకోవడం ముగిసిన తరువాత.. ఇప్పుడు హోదా అంటూ ప్రజలను వంచించే కార్యక్రమం చేస్తున్నాడని మండిపడ్డారు. యూటర్న్‌ తీసుకొని హోదా అంటూనే ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే హోదా సాధించడంలో చంద్ర‌బాబు విఫలమయ్యారన్నారు.

ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం పోరాడుతున్న నాయకులు ఆంధ్రరాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన వైఎస్‌ ఆర్‌ సీపీ - వామపక్షాలు - ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్‌ వల్ల ప్రయోజనం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ఎన్నిసార్లు బంద్‌లకు పిలునిచ్చిందో గుర్తు చేసుకో చంద్రబాబూ అని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.